Bala Krishna : అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన ఘటన సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో వివాదానికి దారితీసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీలకంఠాపురంలోని 10వార్డు టీడీపీ అభ్యర్థి ఇంటికెళ్లిన బాలయ్య, వారి ఇంట్లో జ్యూస్ తాగాడు. ఎన్నికలపై అభ్యర్థితో మాట్లాడుతుండగా, అతడిసోదరుడు సోము వీడియో తీశాడు. దీంతో బాలయ్యకు పిచ్చ కోపం వచ్చింది. వీడియో తీసిన వ్యక్తి చెంప చెళ్లుమనిపించాడు. ఆవేశానికి లోనైన బాలయ్య, వెంటనే ఆ వీడియో డిలీట్ చెయ్ అంటూ ఆ వ్యక్తి చెంప మీద కొట్టాడు. ఉన్నట్టుండి బాలయ్య కోపంతో ఊగిపోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
ఇది నాకు గర్వకారణం!
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ యువకుడిపై చేయి చేసుకున్నారన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న యువకుడు స్పందించాడు. బాలయ్య బాబు తనను టచ్ చేసినందుకు గర్వంగా ఉందంటూ ఆ యువకుడు ఓ వీడియో విడుదల చేశాడు.ఆ వీడియోలో ఏముందంటే..‘‘నా పేరు సోము. నేను బాలయ్య బాబుగారి వీరాభిమానిని. బాలయ్య బాబు గారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా శ్రమిస్తున్నారు. ప్రచారంలో భాగంగా బాలకృష్ణ మా అన్నయ్య ఇంటికి వచ్చారు. నేను ఎవరో తెలియక బయట వ్యక్తి అనుకుని నన్ను పక్కకు తోశారు. అయినా ఇలాంటి వాటిని మాలాంటి ఎన్బీకే ఫ్యాన్స్ పట్టించుకోము. ప్రత్యర్థులు దీన్ని రాజకీయ కోణంలో చూస్తే వాళ్లంతటి మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ రోజు ప్రచారంలో బాలయ్య బాబు గారు ఎవరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాంటిది ఈ రోజు నన్ను ఆయన టచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాలయ్య బాబుగారు నన్ను టచ్ చేశారని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. జై బాలయ్య. జై తెలుగుదేశం’’ అంటూ ఆ వీడియోలో యువకుడు వెల్లడించాడు.
Bala Krishna : ఇదేమీ కొత్తకాదు!
నందమూరి బాలకృష్ణ తన అభిమానులను కొట్టడం ఇదే మొదటిసారి కాదు.ఇంతకు ముందు కూడా రెండు మూడుసార్లు ఇలాగే జరిగింది.అయితే ఎప్పటికప్పుడు అభిమానులే సర్దుకుపోతున్నారు.మొత్తం మీద బాలకృష్ణ ఎప్పుడూ టెంపర్ తో ఉంటారన్నది ఒక టాక్. అది నిజమనేటట్లే ఆయన ప్రవర్తన ఉంటోంది.