దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తి పట్ల , ప్రవృత్తి పట్ల , ప్రకృతి పట్ల , మన చుట్టూ ఉన్న ప్రతిదానికి కృతజ్ఞ తా పూర్వకంగా ఉండడము పూజ . అహం , మనస్సు , రాగద్వేషాలు నాశనం చేయటమే సాధకుడు చేయవలిసిన నిజమైన సాధన. అంతఃకరణ శుద్ధి చేసుకోవడమే సాధన. మంచి పని చేయటం కూడా అత్యుత్తమ ప్రార్ధన . సర్వము యందు సమస్త మందు ప్రేమగా ,దయగా నడుచుకోవటమే నిజమైన పూజ.
భూమి మీద జన్మించాము అంటే ,కొన్ని అనుభవాలు పొందటానికి అని అర్ధం. ఆ అనుభవాలు పండించడం ద్వారా ఈశ్వరుడు జీవులను వివేకవంతులను చేస్తాడ . చెరకుగడ , గెడలాగే ఉంటె రసం రాదు . దానిని యంత్రంలో పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది . అలాగే దేహం అనేక కష్టాలకు గురి అయినప్పుడు మాత్రమే, అమృతత్వం వస్తుంది .
కష్టాలు వస్తే కంగారు పడకూడకు, చేసుకున్న ప్రారబ్ధం పోగొట్టడానికి నీలో విశ్వాసం పెంచటానికి దేవుడు కొన్ని కష్టాలను ఇస్తాడు . నీకు ఇష్టమైనది చేసాడనుకో గర్వం వచ్చి, నీవు పాడైపోయే ప్రమాదం ఉంది. నీకు ఏది మంచిదో నీకంటే భగవంతుడికి బాగా తెలుసు. నీకు బాధ కలిగించే సంఘటన జరిగితే భగవంతుడు ఎందుకు ఇలా చేసాడు అని అనుకోకు . ఆకష్టాలు వచ్చింది నీలోపల సౌందర్యం పెంచటానికి నిన్ను మహోన్నతుడిని చేయడానికి నీకు శిక్షణ ఇవ్వడానికి, నీ జ్ఞానం పూర్ణం చేయడానికి ఈశ్వరుడు ఇలా చేస్తూ ఉంటాడు, అని అర్ధం చేసుకో గలిగితే నీలో ఆవేదన ఆందోళన అణిగిపోతుంది .అంతేగానీ భగవంతుడిని మాత్రం విడిచి పెట్టకూడదు . ఈశ్వరుడు తప్ప, నిన్ను కాపాడగలిగే శక్తి ఇంకా ఎవ్వరికి లేదు.