మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్టు అనంతరం చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని, అది అరెస్టు కాదని, హోం మంత్రి రాజినామా చేయాలని చెప్పుకొచ్చారు. అయితే వీటికి సమాధానాలుగా అచ్చెన్నాను ఎంత జాగ్రత్తగా, హుందాగా తీసుకెళ్లారో వీడియోలో చూపించగా, అనంతరం ఏసీబీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి అచ్చెన్నా అరెస్ట్ గురించి (కిడ్నాప్ కాదని) మరింత క్లారిటీ ఇచ్చారు, ఇక హోం మంత్రి అయితే తనదైన శైలిలో స్పందించి… తప్పుచేశారు కదా వదిలేయమంటారా? అంటూ రిప్లై ఇచ్చారు. అక్కడితో ఇక బాబు ఆ మాటలు మాట్లాడటం మానేశారు. అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో 300 మంది పోలీసులతో అచ్చెన్నాయుడి ఇంటి మోహరించారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని కనీసం మందులు కూడా తీసుకోనివ్వకుండా ఎత్తుకొచ్చారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంట్లోంచి బలవంతంగా ఆయనను తీసుకువచ్చారు. ఆయన ఏమన్నా టెర్రరిస్టా..? ప్రజాప్రతినిధి పట్ల ఇలాగేనా ప్రభుత్వం వ్యవహరించేది. కనీసం మాస్కులు కూడా ధరించకుండా.. బలవంతంగా అచ్చెన్నాయుడు ఇంట్లోకి ప్రవేశించారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని రోజంతా రాష్ట్రంలో ఎక్కడెక్కడో తిప్పారు. వైకాపా కక్ష సాధింపు చర్యలకు అంతులేదా..? అని ఫైరయ్యారు!
ఏడాది కాలం తర్వాత ఒక విషయం బయటపెట్టి దాన్ని సీబీఐ కి ఇవ్వడం, మరో వ్యవహారం గుర్తించి ఏసీబీకి ఇచ్చి మాజీ మంత్రిని అరెస్ట్ చేయడంపై బాబు స్పందించారు. ఏడాది నుంచి చూస్తున్నాం. ఏమీ లేదు కదా! మేం అన్ని చట్టపరంగా చేశాం. వైసీపీ పూర్తిగా బురదలో కూరుకుపోయి ఆ బురదను మాకు అంటించాలనుకుంటున్నారు. మేం ఎవరికీ భయపడం.. హైకోర్టు వాతలు పెట్టినా సిగ్గురాలేదు.. రాజ్యాంగం ప్రకారం అందరం నడుచుకోవాలి.. అచ్చెన్నాయుడు వైసీపీకి కొరకరాని కొయ్యలా ఉన్నారు కాబట్టి ఇలాంటివి చేస్తున్నారు. మేము 5ఏళ్లు నీతివంతమైన పాలన ఇచ్చాం.. వైసీపీ ఏడాదిలోనే 50 ఏళ్ల అవినీతికి పాల్పడింది. అంటూ చంద్రబాబు వైసిపి పాలనపై ధ్వజమెత్తారు.