తెలంగాణ సీఎం కేసిఆర్ పై బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసిఆర్ ..రాష్ట్ర రాజధాని పాట్నాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చైనా సరిహద్దులోని గల్వాన్ ఘటనలో అమరులైన అయిదుగురు బీహార్ సైనికుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించారు. అదే విధంగా కొద్ది నెలల క్రితం సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ దేశం కోసం జవాన్లు ప్రాణాలు అర్పించారనీ, వారి త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు సైనికులకు అండగా ఉంటారని చెప్పారు. బీహార్ లో జరిగిన ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కరోనా కాలంలో వలస కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారనీ, వారిని స్వగ్రామాలకు చేర్చడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో బీహార్ వలస కార్మికులు భాగస్వాములు అయ్యారని, అలాంటి వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామని చెప్పారు.
కేంద్రంలోని మోడీ సర్కార్ పైనా విమర్శలు గుప్పించారు సీఎం కేసిఆర్. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని నరేంద్ర మోడీ సర్కార్ ఆాయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై దాడులకు తెగబడుతోందని విమర్శించారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమని కేసిఆర్ పేర్కొన్నారు. సీబీఐ ప్రవేశాన్ని నిరాకరిస్తూ బీహార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు కేసిఆర్. మిగిలిన అన్ని రాష్ట్రాలు ఇదే పని చేయాలని కేసిఆర్ పిలుపునిచ్చారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ అమరజవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు దేశంలో మరే రాష్ట్రం ముందుకు రాకపోయినా తెలంగాణ సీఎం కేసిఆర్ ముందుకు వచ్చారని కితాబు ఇచ్చారు. కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ అమరజవాన్ల కుటుంబాలకు అసరగా నిలవడం గొప్ప విషయమన్నారు. అసలు అమరవీరుల ను ఆదుకోవాలన్న సీఎం కేసిఆర్ ఆలోచనే గొప్పదని నితీశ్ కుమార్ కొనియాడారు. ఇదే క్రమంలో తెలంగాణలోని నీటి ప్రాజెక్టులను ప్రశంసించారు. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అన్నారు. ఈ పథకం తీరు తెన్నులను పరిశీలించేందుకు తమ ప్రభుత్వంలోని కొందరు అధికారులను తెలంగాణకు వెళ్లాలని ఆదేశించినట్లు సీఎం నితీశ్ తెలిపారు. గ్రామ గ్రామానికి తాగునీరు అందించే ఈ పథకం స్పూర్తిగా నిలుస్తుందన్నారు. కోవిడ్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేయూత నిచ్చిందని నితీశ్ అన్నారు.
తొలుత బీహార్ పర్యటనలో భాగంగా పాట్నాకు చేరుకున్న సీఎం కేసిఆర్ కు విమానాశ్రయంలో సీఎం నితీశ్ కుమార్, డిప్యూటి సీఎం తేజస్వి యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురు బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నితీశ్ కుమార్,. తేజస్వి యాదవ్ తో జాతీయ రాజకీయాలపై కీలక చర్చలు జరిపారు కేసిఆర్. ఇటీవల కాలం వరకూ ఎన్ డీఏ పొత్తుతో సాగిన నితీశ్.. రీసెంట్ గా బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్ జే డీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నితీశ్ తో కేసిఆర్ చర్చలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.