న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 5,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ప్రబలినప్పటి నుండి ఒక్క రోజే ఇన్ని కేసులు నమోదు అవ్వడం ఇదే మొదటి సారి కావడం విశేషం. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 96,698కి మృతుల సంఖ్య మూడు వేలు దాటింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ , గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.
మహారాష్ట్రలోనే నిన్న అత్యధికంగా 2,347 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. వీటిలో ఒక్క ముంబయి నగరంలో 1,595 కేసులు ఉన్నాయి. 63 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 33,053లకు చేరుకున్నది. కరోనా నుంచి 7988 మంది కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. కోరనా వైరస్ కారణంగా 1135 మంది మృతి చెందారు. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల వరకు ఆగకుండా కరోనా కట్టడికి మహారాష్ట్ర సర్కార్ ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ని పొడిగించింది.
తమిళనాడు విషయానికి వస్తే అక్కడ కరోనా బాధితుల సంఖ్య 11,224కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నై నగరంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 6,750గా ఉన్నది. కరోనా తీవ్రతని మరింతగా అడ్డుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం మే 31 వరకు లాక్ డౌన్ ని పొడిగించిన విషయం తెలిసిందే. గుజరాత్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో గుజరాత్ లో 34 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కరోనా మృతుల సంఖ్య 659కి చేరింది. ఇప్పటి వరకు 11,300 కేసులు నమోదు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2282కి చేరింది. ఇప్పటి వరకూ కరోనా వైరస్ నుంచి కోలుకుని 1527 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జి కాగా.. 50 మంది మృతి చెందారు. 705 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24గంటల్లో కొత్తగా 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1551కి పెరిగింది. ఇప్పటి వరకు 992 మంది కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ కాగా 34 మంది మృతి చెందారు. 525 మంది చికిత్స పొందుతున్నారు.