న్యూఢిల్లీ : భారత్లో నాల్గవ విడత లాక్ డౌన్ అమలు అవుతున్నా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. లాక్ డౌన్ సడలింపులు కొనసాగుతుండగా మరో పక్క రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గడచిన 24 గంటల్లో 6,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులో ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే దేశంలో తొలిసారి. కొత్తగా నమోదయిన కేసులతో కలిపి భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,447కు చేరింది. గత 24 గంటల్లో 148 మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో.. భారత్లో కరోనా మరణాల సంఖ్య 3583కు చేరుకున్నది. ఒక పక్క లాక్డౌన్ను అమలు చేస్తున్నప్పటికీ ఈ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.
భారత్తో ఇప్పటి వరకూ వైరస్ సోకిన 48,533 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 66,330 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలో కరోనా రికవరీ రేటు 40.97 శాతంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలో గురువారం ఒక్క రోజే రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. గురువారం ఒక్క రోజే మహారాష్ట్రలో 60 మందికి పైగా కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి.