న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అంఫన్ తుఫాన్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ కోల్ కతా విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహిస్తారు.
అంఫాన్ తుఫాన్ ధాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి. అంఫన్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో సుమారు రూ.లక్ష కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని స్వయంగా చూడాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం మమతా బెనర్జీ ఆహ్వానించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేయనున్నారు.
‘నా జీవితంలో ఇలాంటి భయంకరమైన తుఫాన్ను చూడలేదు. ప్రధాని స్వయంగా వచ్చి నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించాలి’ అని సీ ఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీనికంటే ముందు ప్రధాని మోదీ తుఫాన్ పై స్పందిస్తూ నష్టపోయిన అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన తుఫాన్ బాధితులకు భరోసా కల్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు.