ప్రపంచంలోని అనే దేశాలను వణికించిన కరోనా వైరస్ భారత దేశంలోనూ తన పంజా విసురుతోంది. దేశంలో నేటి వరకు రెండు లక్షల 36వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,642 మంది మృతి చెందారు. దేశంలో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదు అవుతుండగా, ఇప్పటి వరకు లక్షా 14వేలకు మందికి పైగా పాజిటివ్ కేసుల నుండి రికవర్ అయ్యారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన రేగుతుంటే…భారత్ లో కరోనా గురించి అంతగా భయపడాల్సిస అవసరం లేదని చెబుతోంది భారత ప్రభుత్వ పరిశోధన సంస్థ సీసీఎంబీ.
భారత్ లో ఉన్న కరోనా వైరస్ అంత ప్రాణాంతకమేమీ కాదని పేర్కొన్నారు సీసీఎంబీ శాస్త్రవేత్త, డైరెక్టర్ రాకేష్ కుమార్ మిశ్రా. రోజులు గడిచే కొద్ది కరోనా వైరస్ ప్రభావం తగ్గుతోందని అన్నారు. భారత ప్రజల రోగ నిరోధక శక్తి కూడా కరోనాను కట్టడి చేసే సామర్థ్యం పెంచుతుందని అన్నారు.
రోజు రోజుకు కరోనా వైరస్ తన తీవ్రత కోల్పోతున్న కారణంగా రాబోయే రోజుల్లో కేవలం 10 శాతం మంది కరోనా వైరస్ బాధితులు మాత్రమే ఆసుపత్రిలలో చేర్చాల్సిన అవసరం పడుతుందని చెప్పారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్, మందుల కోసం సీసీఎంబీ కూడా పనిచేస్తున్నా వచ్చే ఏడాది మొదట్లో కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ఒక వేళ వాక్సిన్ వచ్చినా అది అందరికి అందుబాటులో ఉండేందుకు చాలా సమయం పడుతుందని అన్నారు.
ఇప్పటికే 100 కు పైగా కంపెనీలు కరోనా వైరస్ వ్యాక్సిన్, మందుల కోసం పనిచేస్తున్నాయన్నారు. లక్షల మందిపై ప్రయోగాలు జరిపి, అన్ని కుదిరితేనే వ్యాక్సిన్ భయటకు వస్తుందని రాకేష్ కుమార్ మిశ్రా వెల్లడించారు.
దేశంలో హర్డ్ ఇమ్యూనిటి గురించి చర్చ సాగుతోందని, దేశం మొత్తం జనాభాలో 50 శాతం మందికి పైగా కరోనా వైరస్ బారిన పడితే హర్డ్ ఇమ్యూనిటి మొదలైనట్లు భావించాలని అన్నారు. కానీ ఇండియా వంటి భారీ జనాభా గల దేశంలో హర్డ్ ఇమ్యూనిటి ప్రయోగం ఫెయిల్ అయితే చికిత్స చేసేందుకు ఆసుపత్రులు ఏ మూలకు సరిపోవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాకేశ్ కుమార్ మిశ్రా.