ఢిల్లీ: మహారాష్ట్ర, హరియానా అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఈ రెండు రాష్ట్రాలలో అక్టోబర్ 21న ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది, శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ వివరాలు ప్రకటించారు. ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని చెప్పారు. అక్టోబర్ నాల్గవ తేదీతో నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. అక్టోబర్ అయిదున నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉప సంహరణకు అక్టోబర్ ఎడవ తేదీ వరకూ గడువు విధించారు. అక్టోబర్ 21న ఎన్నికలు నిర్వహించి 24న ఫలితాలు వెల్లడిస్తామని సునిల్ అరోరా తెలిపారు.
మహారాష్ట్రలో 288, హరియానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ తొమ్మిదవ తేదీన, హరియానా అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ రెండున ముగియనుంది. మహారాష్ట్రలో 8.94కోట్లు, హరియానాలో 1.82కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేయనున్నామనీ, భద్రతాపరమైనై చర్యలు చేపట్టనున్నామనీ అరోరా వెల్లడించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తామని అరోరా చెప్పారు.
మరోవైపు దేశవ్యాప్తంగా 64 చోట్ల ఉప ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
అక్టోబరు 21నే ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆరోడా తెలిపారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబరు 23న విడుదల కానుంది. సెప్టెంబరు 30తో నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. అక్టోబరు ఒకటిన నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు మూడవ తేదీ వరకు గడువు విధించారు. అక్టోబరు 21న ఎన్నికలు నిర్వహించి అక్టోబరు 24న ఫలితాలు వెల్లడించనున్నారు.
తెలంగాణలోని హుజూర్నగర్తో పాటు అరుణాచల్ప్రదేశ్లో ఒకటి, అసోంలో నాలుగు, బిహార్లో అయిదు, ఛత్తీస్గఢ్లో ఒకటి, గుజరాత్లో నాలుగు, హిమాచల్ప్రదేశ్లో రెండు, కర్ణాటకలో 15, కేరళలో అయిదు, మధ్యప్రదేశ్లో ఒకటి, మేఘాలయలో ఒకటి, ఒడిశాలో ఒకటి, పుదుచ్చేరిలో ఒకటి, పంజాబ్లో నాలుగు, రాజస్థాన్లో రెండు, సిక్కింలో మూడు, తమిళనాడులో రెండు, ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.