లక్నో: ఆయుష్ చతుర్వేది అనే కుర్రాడు జాతిపిత మహాత్మ గాంధీపై చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియలో సంచలనంగా మారింది. ఆయుష్ చతుర్వేది అనే విద్యార్థి వారణాసిలోని సెంట్రల్ హిందూ బాయ్స్ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయుష్, గాంధీ గొప్పతనం గురించి ప్రసంగించడమే కాక నేటి తరం ఆయన విలువలను, నమ్మకాలని ఎలా గాలికి వదిలేస్తుందో వివరించాడు.
‘నాడు బ్రిటీషర్లు గాంధీని రైలులో నుంచి తోసేశారు. కానీ ఏదో ఒక నాడు ఈ వ్యక్తే భారత్లో బ్రిటీష్ అధికారానికి చరమగీతం పాడతాడని అప్పుడే వారికి తెలిసి ఉంటే.. అలా చేసే వారు కాదు. నేడు చాలా మంది దేశ విభజనకు గాంధీజీనే కారణమని భావిస్తూ.. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఆశయాలకు మతం రంగు పులుముతున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు గాంధీ కంటే గొప్ప హిందువు మరొకరు లేదు. ఆయన నిత్యం జపించే హే రామ్ నినాదం ఆనాడు ఏ వర్గాన్ని భయపెట్టలేదు. ఎందుకంటే భారతదేశంలో లౌకిక వాదానికి గాంధీనే నిలువెత్తు నిదర్శనం’ అని ఆయూష్ అన్నాడు. అన్య మతస్తులను కొట్టి చంపేందుకు జైశ్రీరాం నినాదాన్ని వాడుకుంటున్న వారికి ఆయుష్ తన ప్రసంగం ద్వారా గట్టి సమాధానం ఇచ్చాడు.
గాంధీ అహింస మార్గాన్ని వదిలేసి కంటికి కన్నుగా వ్యవహరిస్తే.. ప్రపంచమే అంధకారంగా మారుతుందని హెచ్చరించాడు. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశ స్వాతంత్య్రోద్యమానికి నేతృత్వం వహించిన గాంధీని తుపాకీతో మూడుసార్లు కాల్పి చంపారని పేర్కొన్నాడు. అయితే గాంధీ వ్యక్తి కాదు, ఒక ఆలోచన, ఆలోచనకి చావు లేదు అని అతను పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఆయూష్ ప్రసంగం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఆయూష్ స్పీచ్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.