(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
గత నెలలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాలలో భారీ ఎత్తున పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధమిక అంచనా ప్రకారం 4800కోట్ల కు పైగా పంట నష్టం జరిగింది. ఈ విషయం పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు.
పంట నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని, తక్షణ సాయం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో పంట నష్టం పరిశీలించేందుకు కేంద్ర బృందం సోమవారం రాష్ట్రానికి చేరుకొంటోంది. సోమ, మంగళవారంలో ఈ బృందం పలు జిల్లాలో పర్యటించనున్నది. సోమవారం మధ్యాహ్నం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంట నష్టంపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం కేంద్ర బృందం మొదటి రోజు ఇబ్రహీంపట్నం, నందిగామ నియోజకవర్గాలలోని కొటికలపూడి, గనిఅత్కురు, చెవిటికల్లు తదితర ప్రాంతాలలో దెబ్బ తిన్న పలు పంటలను పరిశీలించనున్నారు. సాయంత్రం విజయవాడలో రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కేంద్ర బృందం సమావేశం కానున్నది.