దసరా సందర్భంగా పెన్షన్ దారులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. చంద్రబాబు ప్రభుత్వ హయంలో పెండింగ్ లో పెట్టిన రెండు డీఏలాతో పాటు మొత్తం మూడు డీఏల మంజూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాలపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ ను కలిసి డీఏలను మంజూరీ చేయాలని కోరిన విషయం తెలిసిందే.
ఈ డీఏల విషయంపై సానుకూలంగా స్పందించిన సీఎం వీటిని మంజూరీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ మూడు డీఏల మంజూరీతో ఖజానాపై ఏడాదికి రూ. 3,802 కోట్ల భారం పడనుంది. అట్లాగే జీపీఎఫ్ జమ చేయడానికి మరో రూ. 9,504 కోట్ల వ్యయం కానుంది. దీంతో 4,49,000 ఉద్యోగులకు, 3,57,000 మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది.
మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన సగం జీతాలను 5 విడల్లో చెల్లించనున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామ్ రెడ్డి పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న డీఏల్లో మొదటి విడత 2021 జనవరి నుంచి ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలిపారు. రెండో డీఏను 2021 జులై నుంచి, మూడో డీఏని 2022 జనవరి నుంచి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.
పండగకు తీపికబురు అందించిన సీఎం జగన్కు ఉద్యోగ సంఘాల నేతలు పలు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమం పట్ల సీఎం జగన్ కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పలువురు నేతలు పేర్కొన్నారు.