భారతదేశం గర్వించదగ్గ ప్రధానుల్లో.. తనమార్కు పాలనను అందించిన ప్రధానుల్లో.. విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రధానుల్లో పీవీ నరసింహరావు ఒకరు! కాంగ్రెస్ పార్టీకి తనమార్కు వైభవాన్ని యాడ్ చేసిన పనితనం ఆయన సొంతం. కానీ…కాంగ్రెస్ పార్టీలో ఉండే ఉపయోగంలేని కొన్ని ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల మరణానంతరం అయినా పీవీని ఆ పార్టీ ఓన్ చేసుకోవడంలో పరిపూర్ణంగా విఫలమయ్యిందనే అనుకోవాలి! అయితే ఆ తప్పు వైఎస్సార్ విషయంలో జరగకుండా చూసుకుంటుంది నేడు!
నిజంగా పీవీ నరసింహరావుని సొంతం చేసుకోవడంలో.. మా పార్టీ నేత అని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా విఫలమవడంతో… తెరాస ఆ పని పూర్తిచేసుకుంది. మాజీ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని నాటి కాంగ్రెస్ వదిలేసుకున్నా… తెలంగాణ సెంటిమెంట్ పేరుచెప్పో, ఓటు బ్యాంకు రాజకీయంలో భాగంగానో కానీ… కేసీఆర్ ఆ పని చక్కగా పూర్తిచేస్తున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించడం.. భారతరత్న డిమాండ్ చేయడం వంటివి ఇందులో భాగాలు. దాంతో పీవీ నరసింహారావు.. తెలంగాణ మనిషి అయిపోయారు తప్ప కాంగ్రెస్ పార్టీ మనిషి కాలేకపోయారు. అది పూర్తిగా కాంగ్రెస్ స్వయంకృతాపరాధం!
తగిలిన దెబ్బలు, తగులుతున్న దెబ్బలు నేర్పిన పాఠాల్లో లేక అవసరాలు సృష్టించిన అవకాశాలో తెలియదు కానీ తాజాగా వైఎస్సార్ ను పూర్తిగా ఓన్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా తాజాగా… వైఎస్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో ఆయన విగ్రహానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య తదితరులు నివాళులర్పించారు. అనంతరం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మోస్ట్ పాపులర్ లీడర్ వైఎస్సార్ అని కొనియాడారు. వైస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు భారతదేశ వ్యాప్తంగా పాలకులందరూ పాటిస్తున్నారని.. వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని.. రైతులకు, యువతకు, విద్యార్థులకు, మహిళలకు, వైఎస్ రాజశేఖరెడ్డి ఒక ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేశారని కొనియాడారు.
దీంతో… ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందేమో కాంగ్రెస్ నేతలు అని కామెంట్లు పడుతున్నాయి. ఎందుకంటే… ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషి. కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు. అలాంటి వ్యక్తిని సొంతం చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు ప్రదర్శించి ఉండాల్సింది. ఢిల్లీ స్థాయిలో కూడా సోనియా, రాజీవ్ లాంటి వారు సైతం ఆయను ఇవ్వాల్సిన స్థాయిలో నివాళులు అర్పించి ఉంటే.. మరింత బాగుండేది! ఏమోలే… ప్రస్తుతానికి రాష్ట్రస్థాయి నేతలు కళ్లు తెరిచారు.. మరి ఢిల్లీ పెద్దలు ఎప్పుడు తెరుస్తారో! ఎంత తెరిచినా ఏపీలో ఛాన్స్ లేదు కానీ… తెలంగాణకి ఏమైనా ఉపయోగపడుతుందేమో చూసుకోవాలనే కామెంట్లు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తున్నాయి!