Corona Lock Down: కరోనా రెండవ దశ విజృంభిస్తున్న కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వైరస్ కట్టడి చర్యలో భాగంగా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ పెడుతున్నాయి. అయినప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టని రాష్ట్రాలలో పాలకులు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నుండి 24వ తేదీ వరకూ సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఈ రోజు నుండి 16వ తేదీ వరకూ లాక్ డౌన్ ప్రకటించగా, కర్నాటక ప్రభుత్వం కూడా ఈ నెల 10వ తేదీ నుండి రెండు వారాల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన తరువాత రెండు రాష్ట్రాలు కర్నాటక, తమిళనాడు లాక్ డౌన్ ప్రకటించడం గమనార్హం. ప్రధానంగా లాక్ డౌన్ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయాధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేసింది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా లాక్ డౌన్ విధించడం వల్ల ప్రభుత్వం ఒక్క శాతం నష్టపోతే, ప్రజలు దానికి నాలుగు రెట్లు నష్టపోతారని పేర్కొన్నారు. ఏపిలో మాత్రం కర్ఫ్యూ అమలు జరుగుతోంది.
దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 4,01,078 కొత్త కేసులు నమోదు కాగా 3,18,609 మంది చికిత్స అనంతరం పూర్తి గా కొలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. 4,187 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకూ 2,18,92,678 కేసులు నమోదు కాగా 1,79,30,960 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. 2,38,270 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 37,23,446 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 16,73,46,544 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.