వైద్యులు చేసిన పొరబాటు చర్యకు తమిళనాడు ప్రభుత్వం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ మహిళలకు వైద్యులు కలుషిత రక్తం ఎక్కించిన ఘటనలో తమిళనాడు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవిత కాలం ఆమెకు నెరసరి భత్యం చెల్లించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది.
విరుదునగర్ జిల్లా సత్తూరు గ్రామానికి చెందిన ఓ గర్బిణి 2018లో రక్తహీనతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది. అయితే ఆ ఆసుపత్రిలో వైద్యులు పొరబాటున ఆమెకు ప్రాణాంతకమైన హెచ్ఐవీ వైరస్ కూడిన రక్తాన్ని ఎక్కించారు. ఆ తరువాత ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో హెచ్ఐవీ పొజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. 2019లో ఆమె ఇద్దరు మగ పిల్లల (కవలలు) కు జన్మనిచ్చింది. అదృష్టవశాత్తు ఆ బిడ్డలకు వైరస్ సోకలేదు. ఆమె పేద మహిళ కావడంతో కొందరు వ్యక్తులు ఆమె తరపున కోర్టును ఆశ్రయించారు. ఆసుపత్రి వైద్యులు చేసిన పొరబాటుకు ఆమె జీవితాంతం నరకం అనుభవించాల్సిన పరిస్థతి ఏర్పడిందనీ, ఆమెకు న్యాయం చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది ద్వారా కోర్టును అభ్యర్థించారు. చేయని తప్పుకు బలైన ఆ మహిళ పట్ల కోర్టు సానుభూతితో స్పందించింది. బాధితురాలికి రూ.25లక్షల నష్టపరిహారంతో పాటు ఓ ఇల్లు కూడా ప్రభుత్వం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
కాగా తాను ప్రాణాంతకమైన వైరస్ తో బాధపడుతున్నందున వైద్యులు బలవర్థకమైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారనీ, పేద రాలినైన తాను పండ్లు, ఇతర పోషక పదార్ధాలు కొనుగోలు చేసుకునే ఆర్థిక స్థోమత లేనందున సాయాన్ని మరింత ఇప్పించాలని కోర్టును వేడుకున్నది. దీంతో జస్టిస్ కిరుబాకరన్, జస్టిస్ పుగళేంది ల నేతృత్వంలోని ధర్మాసనం ఆమె విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం నెలకు రూ.7500లు చొప్పున సాయం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా బాధిత మహిళకు తగిన ఉపాధి కూడా కల్పించాలని ధర్మాసనం తీర్పులో పేర్కొన్నది.