YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై సీఎం జగన్ తో రాయుడు చర్చించారు. ఈ సందర్భంగా రాయుడుకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అంబటి రాయుడు 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాయుడు ఐపీఎల్ – 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, గత కొంత కాలంగా అంబటి రాయుడు జగన్ ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేస్తారని కూడా గత కొంత కాలం నుండి ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో జగన్ తో అంబటి రాయుడు భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఏపిలో ఏదైనా క్రికెట్ అకాడమి పెట్టేందుకు జగన్ వద్దకు అంబటి రాయుడు వచ్చారా..? లేక రాజకీయంగా నిర్ణయం తీసుకుని వచ్చారా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంబటి రాయుడు గుంటూరు జిల్లాకు చెందిన కాపు సామాజికవర్గానికి చెందిన యువకుడు కావడంతో ఆయన సేవలను జగన్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారేమో అన్న వాదన వినబడుతోంది. ఈ అంశంపై అంబటి రాయుడు మీడియాతో మాట్లాడితేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Centre vs Delhi govt case: సుప్రీం కోర్టులో కేంద్రానికి షాక్ .. ఢిల్లీలో అధికారంపై సంచలన తీర్పు