న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన హింసాకాండ, విధ్వంసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగులుతోంది. ఆ హింస, విధ్వంసం కేసుల్లో విచారణ జరుపుతోన్న పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్తో పాటు మరో 14 మందిపై 1,030 పేజీల ఛార్జిషీటు దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనల కోసం ఆయన రూ.1.10 కోట్ల నిధులు ఖర్చు చేశారని పోలీసులు వెల్లడించారు.
ఈశాన్య ఢిల్లీలో హింస పేట్రేగటానికి నెల రోజుల ముందే ఆయన జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్తో పాటు లాభాపేక్ష లేని ఒక సంస్థకు చెందిన ఖలీద్ సైఫీ అనే వ్యక్తిని కలిశాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఉమర్ ఖలీద్పై ఏప్రిల్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును జరిపారు.
ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటిస్తోన్న సందర్భంగా ఏదైనా పెద్ద కుట్ర ప్లాన్ చేయాలని హుసేన్కు సైఫీ చెప్పాడని పోలీస్ దర్యాప్తులో తెలుసుకున్నారు. అలాగే అతడికి డబ్బు కూడా ఇచ్చాడనీ, తనతో పాటు తన కంపెనీల ఖాతాల్లో సైఫీ జనవరిలో రూ.1.10 కోట్ల నిధులు జమచేశాడనీ హుసేన్ పోలీసులకు తెలిపాడు. ఆ డబ్బును హుసేన్ సీఏఏ ఆందోళనకారులకు పంపిణీ చేసి విధ్వంసానికి ప్రోత్సహించాడు. హుసేన్ వద్ద లైసెన్స్డ్ రివాల్వర్ కూడా ఉంది. సీఏఏకి మద్దతు తెలుపుతున్న వారి నుంచి హాని ఉందని ఆయన ఆ తుపాకీని తీసుకున్నాడు.
ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య వెనుక భారీ కుట్ర ఉందనీ, అందులో తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందనీ పోలీసులు తెలిపారు.