ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటికే పలుమార్లు ధోనీ సారథ్యంలో టైటిల్స్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ఈ సారి అదృష్టం కలిసి రావడం లేదని స్పష్టమవుతోంది. ఆ జట్టు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతోంది. కరోనా నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలే కరోనా వల్ల టోర్నీ ఆలస్యం అయిందని అనుకుంటుంటే ఇప్పుడు చెన్నై టీం వల్ల బీసీసీఐ తలపట్టుకుని కూర్చుంది. టోర్నీకి ఇంకా కొన్ని రోజులే గడువు ఉండడం, ఇంకా షెడ్యూల్ను విడుదల చేయకపోవడంపై బీసీసీఐ ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
చెన్నై టీంలో ఒక్కసారిగా 12 మంది సిబ్బందితోపాటు పేస్ బౌలర్ దీపక్ చాహర్ కరోనా బారిన పడడం కలకలం రేపింది. సరే.. ఓకే.. అని సర్దుకునే లోపే ఆ జట్టు ముఖ్య బ్యాట్స్మన్ సురేష్ రైనా టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకుని భారత్కు వచ్చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీలో పాల్గొనలేకపోతున్నానని రైనా తెలిపాడు. అయితే ఇది చెన్నై టీంకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇది చాలదన్నట్లు తాజాగా చెన్నై టీం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో ఆ జట్టును కరోనా సమస్య మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతానికి ప్లేయర్లు మరో 7 రోజుల పాటు.. అంటే.. సెప్టెంబర్ 5 వరకు క్వారంటైన్లోనే ఉండాలి. అప్పటి వరకు ట్రెయినింగ్కు వెళ్లడానికి కూడా వీలు లేదు. ఈ క్రమంలో ఇంకా ప్లేయర్లు ఎవరైనా కరోనా పాజిటివ్గా తేలుతారా ? అని ఆ జట్టు సందేహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇతర జట్లకు చెందిన సభ్యులు ఇప్పటికే ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టేశారు. కానీ చెన్నై కొంచెం వెనుకబడింది. అయితే ఇంకా సమస్యలు ఏవీ రాకుండా ఉంటే ఇప్పుడున్న సమస్యలు చెన్నైపై పెద్దగా ప్రభావం చూపించవు. దీంతో ఆ జట్టు సభ్యులు టోర్నీలో రాణించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇంకా ఏవైనా సమస్యలు వస్తే.. అది ఆ జట్టు ఆటగాళ్లపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇక చెన్నై టీం సురేష్ రైనాను కోల్పోవడం కూడా పెద్ద మైనస్. ఎందుకంటే రైనాకు ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 164 ఐపీఎల్ మ్యాచ్లలో అతను 4527 రన్స్ చేశాడు. 5368 పరుగులతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్గా ఉన్నాడు. అలాగే జట్టును కీలక సమయాల్లో ఆదుకోగలడు. అవసరం అనుకుంటే పార్ట్ టైం బౌలర్గా కూడా వికెట్లు తీసే సత్తా ఉంది. అలాంటి ప్లేయర్ను కోల్పోవడం నిజంగా చెన్నైకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అయితే చెన్నై ఇప్పటికిప్పుడు రైనాకు ప్రత్యామ్నాయంగా ఇంకా ఎవరినీ తీసుకోలేదు. కానీ చెన్నై టీం ప్రస్తుతం క్వారంటైన్లో ఉంది కనుక ఆ గడువు ముగిశాక రైనాకు ప్రత్యామ్నాయంగా ఎవరినైనా జట్టులోకి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఈసారి చెన్నైకి మాత్రం ఆరంభంలోనే చాలా గట్టి దెబ్బలు ఎదురయ్యాయి. మరి వీటిని తట్టుకుని త్వరలో జరగనున్న ఐపీఎల్ టోర్నీలో చెన్నై జట్టు రాణిస్తుందా, లేదా చూడాలి.