విశాఖ జిల్లా పెందుర్తిలో దళిత యువకుడి శిరోముండనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్, నిర్మాత నూతన్ నాయుడు నివాసంలో అయన భార్య మధు ప్రియ ఇంట్లో పని వారి సహాయంతో తన ఇంట్లో పని మానేసిన కర్రి శ్రీకాంత్ పై సెల్ ఫోన్ చోరీ చేశాడన్న అభియోగం మోపి అతన్ని తీవ్రంగా కొట్టడమే కాక శిరోముండనం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, ప్రతిపక్షాలు దీన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వంపై విమర్శలకు దిగడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసును తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న పోలీసులు నూతన్ నాయుడు భార్య మధు ప్రియతో సహా నేరంలో పలు పంచుకున్న మరో ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి వారికి రెండు వారాలు రిమాండ్ విధించారు.
జ్యూడిషియల్ రిమాండ్ తప్పించుకునేందుకు..
శిరోముండనం కేసులో ప్రధాన నిందితురాలైన నూతన్ నాయుడు భార్య మధు ప్రియ జ్యూడిషియల్ రిమాండ్ ను తప్పించుకునేందుకు విఫలయత్నం చేసింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసి విఫలం అయ్యింది. పోలీసులు ఆమెను విశాఖ కేజీహెచ్ కి తీసుకొని వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. దీనితో ఆమెను జైలుకు తరలించారు. కాగా కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించేందుకు పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది అంటున్నారు. కోర్టు అనుమతితో నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించనున్నారు.
నూతన్ నాయుడు పాత్రపై అరా
మరో పక్క దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన కేసులో నిర్మాత నూతన్ నాయుడు పాత్ర ఉందా లేదా అన్న దానిపై కూడా పోలీసులు అరా తీస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఆయన ఉన్నారా లేదా, దీనిలో ఆయన ప్రమేయం ఏమైనా ఉందా అనే విషయాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన దళిత యువకుడి శిరోముండనం కేసులో స్వయంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే మరో ఘటన జరగడం తో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతి పక్షాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.