తెలంగాణ రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారు చెప్పే మాట. రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడ? ప్రధానంగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోందనేది అసలు ప్రశ్న.
అధికార పార్టీని ఇరకాటంలో పెట్టడంలో కాంగ్రెస్ నేతలు సరిగా స్పందించడం లేదనే టాక్ ఉంది. ఈ సమయంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాకూర్ రాకతో సీన్ మారిందని చెప్తున్నారు.
అంత నమ్మకం ఉంది కాబట్టే.
పార్టీని సంస్థాగత ప్రక్షాళన చేయాలని, పూర్తిస్థాయి నాయకత్వం ఎన్నుకోవాలంటూ ఇటీవల సీనియర్లు రాసిన లేఖతో కాంగ్రెస్లో ప్రకంపనలు రేగాయి. లేఖ వివాదం ముగిసిన కొన్ని రోజులకు పార్టీలో మార్పులు చేసిన అధిష్ఠానం… దానికి నేతృత్వం వహించిన ఆజాద్కు పదవుల్లో కోతేసింది. ఆయన్ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించింది. ఒక్కడిపైనే చర్యలు తీసుకోకుండా మరికొందరిపైనా చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో రెండు తెలుగురాష్ట్రాలకు ఇంఛార్జులను మార్చారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న ఆర్సీ కుంతియా స్థానంలో తమిళనాడు ఎంపీ మాణికం ఠాకూర్ను పార్టీ నియమించింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ ఉండనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ట్రాక్ రికార్డు మామూలుది కాదు మరి
కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకొనే నేతలు ఆచరణలో మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. రాష్ట్రంలో పార్టీని నిలబెట్టాలనే ఆలోచనను పక్కన పెట్టి నాయకులు తమ తమ రాజకీయం చేయడంలో బిజీగా ఉంటారట. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్లో ఒకరు ఎడ్డెమంటే.. ఇంకొకరు తెడ్డెం అంటారు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అంటున్నారు.
కొత్త నేత అప్పుడే మొదలుపెట్టేశారు
కొత్త ఇంఛార్జీగా మాణికం ఠాకూర్ వచ్చిన తర్వాత కోర్ కమిటీ సమావేశం ప్రతి 15 రోజులకు ఓసారి జరగాలని సమస్యలేవైనా ఆ భేటీలో చర్చించి కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారట. మాణికం స్వయంగా హైదరాబాద్ రాకపోయినా.. కోవిడ్ కారణంగా ఆన్లైన్లో వరస మీటింగ్లు పెట్టి అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రతీ వీడియో కాన్ఫరెన్స్లోనూ.. మాణికం నిక్కచ్చిగా కొన్ని విషయాలు క్లారిటీ ఇచ్చేశారట. ఏది పడితే అది మాట్లాడే నాయకుల నోటికి తాళం వేశారని దీంతో, ఇష్టారాజ్యంగా మాట్లాడటమే కాదు.. ఎవరికి తోచిన పని వాళ్లు చేయడం కూడా మానేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారట. ఎవరు ఏం చేసినా అది పార్టీ కార్యక్రమంగా ఉండాలి తప్పితే.. వ్యక్తిగత అజెండాలు అమలు చేయడం మానుకోవాలని చురకలు వేశారట. పార్టీకి చెప్పకుండా ఏం చేయకూడదని మాణికం ఠాకూర్ తేల్చి చెప్పారట. అయితే మాణికం ఠాకూర్ ఎన్నాళ్లు ఇలా కఠినంగా ఉంటారో దారి తప్పిన వారిని గాడిలో పడతారో లేదో చూడాలి. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తారో కూడా తెలియాలంటే వేచి చూడాల్సిందే.