ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలువస్తున్నాయి. తాజాగా చేసిన పరిశోధనల ప్రకారం గాలిలో ఉన్న కాలుష్యం యువతలో గుండె సమస్యలు పెరగడానికి కారణమవుతున్నట్టు గా తేలింది. కలుషిత గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తుల జబ్బులు, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 60లక్షల మంది అర్ధాంతరంగా మరణిస్తున్నారు.
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు వాయు కాలుష్య మరణాల్లో కూడా ముందే ఉంది. 188 దేశాల జాబితాలో భారత్ 5 వ స్థానంలో నిలిచింది అంటేనే అర్థమవుతుంది మన దేశం లో ఎంతగా వాయు కాలుష్యం పెరిగిపోయిందో . 2015లో భారతదేశంలో 25 లక్షల మంది కాలుష్యంకారణం గా మరణించినట్టు లాన్సెట్ నివేదిక తేల్చింది.
అయితే ఇక్కడ గమనించవలిసిన విషయం ఏమిటంటే ,హాస్పిటల్ కి వచ్చే హార్ట్ పేషెంట్ల లో యువతే ఎక్కువగా ఉన్నారు . సంవత్సరం సంవత్సరానికి వీరి సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది . గాలిలోని కాలుష్యం, ధూమపానం వారి అనారోగ్యానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు
ఇప్పటికే ఢిల్లీలో పొల్యూషన్ కారణంగా ఎంతోమంది గుండె సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారత్ లోని గాలి కాలుష్యం కారణంగా గుండె సమస్యలు పెరుగుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా చేసిన అధ్యయనాలు తేల్చాయని ఎయిమ్స్ ప్రొఫెసర్ వినయ్ గోయల్ తెలిపారు.
ముఖంలో జీవం లేనట్టు గా మారడం, వినడం,మాట్లాడడం, చూడడం లో ఇబ్బందిగా ఉండడం మూర్ఛ, అలసట, వంటి సమస్యలు గాలి కాలుష్యం కారణంగా వస్తున్నాయని బయట పడింది. చాలామంది గుండె సమస్యలు వచ్చినప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధచూపి తగిన జాగ్రత్తలుతీసుకోకపోవడం, రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు చేయించకపోవడం వంటి కారణాలు గుండె సమస్యలు పెరగడానికి ఒక కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ విషయాన్ని గమనించి భావి తరాల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయకపోతే మన భావితరాలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదురుకోక తప్పదు.