దేశ వ్యాప్తంగా లవ్ జీహాద్, మతాంతర వివాహాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. లవ్ జీహాద్కు వ్యతిరేకంగా బీజేపీ పాలిత ప్రభుత్వాలు హిందు యువతులను ముస్లిం వ్యక్తులను వివాహం చేసుకోవడాన్ని నేరంగా పరిగణించే చట్టానికి రూపకల్పన చేయాలని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్, అస్సోం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఈ మేరకు చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు అలహాబాద్ హైకోర్టు ఒక మతాంతర వివాహంపై కీలకతీర్పును వెలువరించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలు ఏమి జరిగింది అంటే..
ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రియాంక ఖన్వార్ (హిందు), సలామత్ అన్సారీ (ముస్లిం) గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ యువకుడి వినతి మేరకు పెళ్లికి ముందు ప్రియాంక మత మార్పిడి చేసుకున్నది. తన పేరు ప్రియాంక నుండి అలియాగా మార్చుకున్నది. అయితే వీరి వివాహంపై యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి బలవంతంగా మత మార్పిడి చేయించి వివాహం చేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సలామత్ అన్సారీతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో సలావత్, ప్రియాంక దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టేసి తమకు రక్షణ కల్పించాలని పిటిషన్లో కోరారు.
సలామత్ పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు వివేక్ అగర్వాల్, పంకజ్ నఖ్వీల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సుమారు సంవత్సర కాలంగా విచారణ జరిపి నేడు తీర్పు వెలువరించింది. వివాహ సమయంలో ప్రియాంక అలియాస్ అలియా వయసు 21 సంవత్సరాలు అయినందన ఆమె మైనర్ కాదని పేర్కొంది. అలియా తన భర్తతో కలిసి జీవించేందుకు కోర్టు అనుమతి కల్పించింది. అంతే గాక ఈ కేసులో పోస్కో చట్టం వర్తించదని ధర్మాసనం తేల్చి చెప్పి సలామత్ ఇతురలపై ఉన్న కేసును కొట్టివేసింది.
మేజర్లు అయిన ఇద్దరు వ్యక్తులు తమ అభీష్టం మేరకు బందం ఏర్పరుచుకొనవచ్చని, ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని ధర్మాసనం పేర్కొన్నది. అలా చేస్తే వారి హక్కులను భంగం కల్గించిట్లే అవుతుందన్నారు. మత మార్పిడి వివాహాల చెల్లుబాటుపై తాము ఇప్పుడు స్పందించబోమని పేర్కొన్నది. ఈ కేసులో హిందువా, ముస్లిమా అనేది చూడమని, వారు మేజర్లా కాదా అనేదే పరిగణలోకి తీసుకున్నామని తెలిపింది.