న్యూఢిల్లీ: శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఐదు రోజులు సెలవుపై వెళ్లారు. రాజీవ్ కుమార్ దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు సిబిఐ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హజరుకావాలని నోటీసు జారీ చేశారు. కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం 10గంటలకు విచారణకు హజరుకావాల్సిందిగా సిబిఐ నోటీసులు పంపింది. విచారణకు హజరయ్యేందుకు మరి కొంత సమయం కావాలని కోరుతూ రాజీవ్ కుమార్ సిబిఐ అధికారులకు లేఖ పంపించారు.
ఆదివారం రాత్రి కొంత మంది సిబిఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ అందుబాటులో లేరు. కోల్కతా సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలో రాజీవ్ కుమార్ ఇక్కడ ఉండేవారు కానీ ప్రస్తుతం లేరని అక్కడి గార్డులు సిబిఐ అధికారులకు తెలిపారు. దీంతో వెంటనే వారు కోల్కతా డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి వెళ్లి రాజీవ్ కుమార్కు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సిబిఐ అధికారులు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న సమాచారంతో ఆయన ఐదు రోజులు సెలవు పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది.
శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసులో సాక్షాలను మాయం చేశారని రాజీవ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల గడువు మే 24తో ముగిసింది. అరెస్టు నుండి మినహాయింపు గడువు పెంచాలని రాజీవ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.