అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వ్యవహారం మరో సారి హైకోర్టు గడప తొక్కనుండటంతో ఈ అంశం మరో సారి ఆసక్తి కరంగా మారుతోంది. ఈ విషయం పై, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ట్విట్టర్ ద్వారా చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుండగా, ప్రచారానికి బలం చేకూరేలా న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కామెంట్స్ ఉండటం చర్చనీయాంశ మవుతోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ప్రభుత్వం తొలగించటం పై అయనతో పాటు బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ తదితరులు హైకోర్టుకు వెళ్లగా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రభుత్వం కొత్త ఎన్నికల కమీషనర్ ని నియమిస్తూ ఇచ్చిన జీవో, రమేష్ కుమార్ ని తప్పిస్తూ ఇచ్చిన జీవోలను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియామకం అయినట్టే అని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం మరో వాదన తెరపైకి తీసుకుని వచ్చింది. రమేష్ కుమార్ ని ఎస్ఈసీగా నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేదని చెప్పింది. కొత్త ఎన్నికల కమీషనర్ నియామకం కుదరదు అని కోర్టు చెప్పిందని, అదే నిబంధనల ప్రకారం ఎన్నికైన నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదు అని ప్రభుత్వం వాదిస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు పూర్తి స్థాయిలో కేసు విచారణ చేస్తామని పేర్కొన్నది.
అనంతరం ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సుప్రీం కోర్టు గడప తొక్కినా స్టే ఇవ్వలేదు సుప్రీం ధర్మాసనం. అయితే ఇప్పటికే హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను మళ్ళీ బాధ్యతలు స్వీకరించినట్లు సెర్క్యూలర్ జారీ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్కులర్ ని క్యాన్సిల్ చేసింది. హైకోర్టు తీర్పు వెలువరించి రోజులు గడుస్తున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ హైకోర్టులో వెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తనను తీసుకోవాలని హైకోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం తనను భాద్యతలు స్వీకరించకుండా ఆటంకం కలిగిస్తోందని నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ వేసే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు ఏమి ఆదేశాలు ఇస్తుంది?, కోర్టు ధిక్కరణ కింద భావిస్తుందా? అనేది వేచి చూడాలి.
ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల వివాద విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభించిన సంగతి విదితమే.