ఒకరు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. మరొకరు ఇప్పుడిప్పుడే.. ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. వీరిలో ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే భర్త. సామాజిక వర్గాల వారీగా కూడా.. సమ ఉజ్జీలు. దీంతో ఆ నియోజకవర్గం హాట్ కేక్లా మారిపోయింది. అదే.. రాజమండ్రి సిటీ గత ఎన్నికలకు ఇప్పటికీ.. చాలా మార్పు చోటు చేసుకున్న ఈ నియోజకవర్గంలోప్రధాన పార్టీల పక్షాన అభ్యర్థుల ఖరారు అయిపోయింది. దీంతో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? అనే చర్చ ఆసక్తిగా మారింది.
గెలుపు ఓటములు మాట ఎలా ఉన్నప్పటికీ.. ఇద్దరూ కూడా యువ నాయకులు కావడం.. బలమైన పక్షాల తరఫున బరిలో దిగుతుండడం వంటివి మాత్రం ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. టీడీపీ విషయాన్ని చూస్తే.. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి వాసు పేరును చంద్రబాబు ఖరారు చేశారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆదిరెడ్డి వాసు ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే మొదటిసారి. వాసు భార్య ఆదిరెడ్డి భవాని ప్రస్తుత ఎమ్మెల్యే. వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా…తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా పనిచేశారు.
రాజకీయ కుటుంబం కావడంతో ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు బలమైన అభ్యర్థిగా నిలుస్తున్నారనే టాక్ ఉంది. అంతేకాదు.. గత ఏడాది జగజ్జనని చిట్ ఫండ్ సంస్థకు సంబంధించి నమోదైన కేసులో జైలుకు వెళ్లిరావ డం.. ప్రజల్లో సింపతీని పెంచింది. అయితే.. ఎన్నికలకు దీనిని ఏవిధంగా వినియోగించుకుంటారనేది చూడాలి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా భవానీకి మంచి పేరే ఉంది. వివాదాలకు దూరంగా.. ప్రజలకు చేరువగా ఆమె నిలిచింది. దీంతో వాసు గెలుపుపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక, సిటీ వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్ బరిలోకి దిగుతున్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన భరత్ గత ఎన్నికల్లో రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 1,80,000 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. ఇది.. ఆయనకు పెద్దబలంగా మారనుందని పార్టీ అంచనా వేస్తోంది. రాజమం డ్రి సిటీలోని బలమైన గౌడ శెట్టిబలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటం భరత్ కు కలిసి వచ్చే అంశం.
భరత్ ఎంపీగా పనిచేసిన తన ఐదేళ్ల పాలనలో రాజమండ్రి సిటీ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో రాజమండ్రిలో అభివృద్ధి పనులను చేపట్టారు. మోరంపూడి ఫ్లేఓవర్, ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు, రాజమండ్రి సుందరీకరణ పనులు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతికూల ఫలితాలు వస్తాయని ఆశాభవంతో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు వైసిపి ఓటమి చెందడంతో అధిష్టానం సైతం సీరియస్గా తీసుకుని ఈసారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంది.