అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈకామర్స్ సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. షాపింగ్ చేయాలంటే బయటికెళ్లి షాపుల్లో గంటలు గంటలు సెలెక్ట్ చేసి టైమ్ అంతా వేస్ట్ చేసుకునే స్థాయి నుంచి.. ఇంట్లోనే ఉండి కావాల్సిన, నచ్చిన వాటిని కొనుక్కునే అవకాశాన్ని ఇచ్చాయి. తొలుత డ్రెస్సులు, కాస్మటిక్స్, హోమ్ అప్లయెన్సెస్ లాంటి వాటితో తమ వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ సంస్థలు ఇప్పుడు ఆ వస్తువు ఈ వస్తువు అని కాకుండా దాదాపు అన్ని రకాల వస్తువులను హోమ్ డెలివరీ చేస్తున్నాయి… ఇంటి సరుకులతో సహా.
ఇటీవలే మద్యం వ్యాపారంలోకి అమెజాన్ అడుగుపెట్టింది. దాని బాటలోనే దేశీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కూడా నడవబోతోంది. ఫ్లిప్ కార్ట్ కూడా మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టబోతోంది.
అయితే.. మద్యం డోర్ డెలివరీని ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రారంభించడానికి ఫ్లిప్ కార్ట్ సన్నాహాలు చేస్తోంది. దాని కోసం ఫ్లిప్ కార్ట్ డియా జియో అనే కంపెనీతో టైఅప్ అయింది. ఆ కంపెనీ ద్వారా హిప్ బార్ రిటైల్ ఔట్ లెట్ల నుంచి మద్యాన్ని సరఫరా చేయనున్నారు.
ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లిక్వర్ బిజినెస్ దాదాపు 27.2 బిలియన్ డాలర్లుగా ఉండబోతున్నదని ఐడబ్ల్యూఎస్ఆర్ అనే లిక్వర్ మార్కెట్ విశ్లేషణ సంస్థ వెల్లడించింది.
నిజానికి.. మద్యాన్ని ఆన్ లైన్ లో విక్రయించడానికి ఇదివరకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ… లాక్ డౌన్ సమయంలో మద్యానికి విపరీతమైన కొరత ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ తర్వాత మద్యాన్ని ఆన్ లైన్ లో విక్రయించడానికి మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అనుమతి ఇచ్చింది.
స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా లాక్ డౌన్ తర్వాత ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆన్ లైన్ లో మద్యం విక్రయాలను ప్రారంభించాయి. ఇక.. పశ్చిమ బెంగాల్ లో లిక్వర్ వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి గ్రోసరీ సంస్థ బిగ్ బాస్కెట్ కూడా రెడీ అవుతోంది.