ప్రధానికి చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ..
టీడీపీ అధినేత చంద్రబాబు చాలా కాలం తరువాత ప్రధానికి ఏపీలో అధికార పార్టీ పైన ఫిర్యాదు చేస్తూ లేఖ రాసారు. ప్రధాని మోదీతో విభేదించి..ఎన్నికల ముందు ధర్మ పోరాటాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే మోదీని ఆకానికెత్తుతూ ప్రశంసించారు. రఘురామరాజు తరహాలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారని వివరించారు.ఆం ధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులు మరియు ఇతరుల ఫోన్ల ట్యాపింగ్ రూపంలో వాటిల్లిన తీవ్రమైన ముప్పు ఉందంటూ ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. రాజ్యంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు ఉల్లంఘించడమే అంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తు న్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. ఆ లేఖను ప్రధానికి అడ్రస్ చేస్తూ రాసిన చంద్రబాబు కాపీ టు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రికి అటాచ్ చేసారు. ఇప్పుడు చంద్రబాబు లేఖ పైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
కేంద్ర సంస్థలతో దర్యాప్తుకు ఆదేశించండి
ఏపీ ప్రభుత్వం..వైసీపీ లక్ష్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాసారు. అందులో ప్రధానంగా కొద్ది రోజులుగా ఒక పత్రిక రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థలోని కొందరి ఫోన్లు ట్యాప్ చేస్తోందంటూ ఇచ్చిన కధనానికి కొనసాగింపుగా ఈ లేఖ ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ లేఖలో ప్రస్తావించిన విధంగానే..ఇప్పుడు లేఖలోనూ చంద్రబాబు ఫోన్ల ట్యాపింగ్ అంశాన్ని ఫిర్యాదు చేసారు. ఇప్పటికే ఆ కధనం ప్రచురించిన పత్రికకు ఏపీ ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇక, చంద్రబాబు రాసిన లేఖలో ఏపీలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేయటం ప్రభుత్వ దినచర్యగా మారిందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19 మరియు 21 ప్రాథమిక హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తోందంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక, గతంలో మోదీ పైన తవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు..లేఖలో ప్రారంభంలోనే మోదీనికి ప్రశంసలతో ముంచెత్తారు. మీ సమర్ధ, శక్తివంతమైన నాయకత్వంలో దేశ భద్రత గణనీయంగా ఇనుమడించింది, మన సాయుధ దళాలు నూతన విశ్వాసాన్ని పొందాయి. అంతర్గతంగా, ఉగ్రవాదులు మరియు ఉగ్రవాద శక్తుల నుండి వచ్చే ముప్పు తగ్గింది, దేశం వెలుపల సరిహద్దులు బలోపేతం చేయబడ్డాయి. మీ నిశిత దృష్టితో కొత్త పొత్తులు ఏర్పడ్డాయంటూ..లేఖలో పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితులపై కేంద్ర దర్యాప్తు సంస్తలతో విచారణ చేయించాలని చంద్రబాబు కోరారు.
జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయంటూ..
చంద్రబాబు తన లేఖలో వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేసారు. వైయస్ఆర్సీపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, రాష్ట్రంలోని ప్రజాస్వామ్య సంస్థలపై ఒక పద్దతి ప్రకారం దారుణమైన దాడి జరిగిందిని వివరించారు. మొదట్లో గత ప్రభుత్వ పాలనలో వచ్చిన పెట్టుబడిదారులపై మరియు విధానాలపై దాడి చేయడం ద్వారా పాలనా ప్రక్రియ పూర్తిగా పట్టాలు తప్పిందని పేర్కొన్నారు. ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) తదితర సంస్థలపై దాడి జరిగిందంటూ ఆరోపించారు. దాంతోపాటుగా ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు మరియు సామాజిక కార్యకర్తలపై అధికార వైయస్ఆర్సిపి దాడులు చేసి బెదిరిస్తోందంటూ ప్రధానికి ఫిర్యాదు చేసారు. టెలిఫోన్ ట్యాపింగ్ జాతీయ భద్రతకే ముప్పు తెస్తుందని పేర్కొన్నారు. ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ ద్వారా, చట్టవిరుద్ధంగా ఈ ట్యాపింగ్ జరుగుతోందని మేము ఆందోళన చెందుతున్నాం. దీర్ఘకాలంలో జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు తెచ్చే అవకాశం ఉన్నందున ఇది మరింత ప్రమాదకరమైనదిగా ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఇటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దుండగుల చేతిలో ఉండడం వల్ల వ్యక్తుల గోప్యత హక్కును కాలరాయడమే కాకుండా, అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులను తమ దారికి తెచ్చుకోడానికి బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు గురిచేయడానికి దారితీస్తుందంటూ చంద్రబాబు తన లేఖలో ప్రధానికి వివరించారు. దీర్ఘకాలంలో ఇటువంటి దుశ్చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కల్గించడమే కాకుండా ఆటవిక రాజ్యం(జంగిల్ రాజ్) వైపు దారితీస్తాయంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు