అగ్రరాజ్యం అమెరికాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సారి అరెస్టు అయ్యారు. ఇంతకు ముందు కూడా పలు కేసుల్లో అరెస్టు అయి బెయిల్ మీద విడుదల అయిన సంగతి తెలిసిందే. తాజాగా 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో రిగ్గింగ్, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో పోలీసులకు లొంగిపోవాల్సి ఉంది. ఈ మేరకు జార్జియా జైలు వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇప్పటికే ట్రంప్ స్వయంగా భారీ భద్రత మధ్య అట్లాంటా ఫుల్ టన్ కౌంటీ జైలు వద్ద లొంగిపోయారు.

రెండు లక్షల డాలర్లు విలువైన బాండ్ ను సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫాని విల్లీస్ అనుమతించారు. దీంతో ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు. ట్రంప్ పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. ట్రంప్ జైలులో 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాము పోలీసుల ఎదుట లొంగిపోయినా దాన్ని అరెస్టు గానే పరిగణిస్తారు. కొన్ని రోజుల క్రితం కూడా 2020 ఎన్నికలకు సంబంధించి కేసుల్లోనే ట్రంప్ అరెస్టు అయ్యారు. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని తాను ఏ తప్పు చేయలేదని ట్రంప్ వెల్లడించారు.
కాగా, బెయిల్ పొందిన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇది నిజంగా అమెరికాకు విచారకరమైన రోజు.. ఇది ఎప్పటికీ జరగకూడదు అంటూ కామెంట్స్ చేశారు.