(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమెరికాలోని మూడు ప్లేస్మెంట్ కంపెనీలకు చెందిన నలుగురు భారతీయులను అమెరికా అధికారులు అరెస్టు చేశారు. హెచ్1బి వీసా కుంభకోణానికి పాల్పడినందుకు న్యూజెర్సీకి చెందిన విజయ్ మానే, వెంకటరమణ మన్నం, ఫెర్నాండో సిల్వాలను, కాలిఫోర్నియాకు చెందిన సతీష్ వేమూరిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఒక్కొక్కరికీ రెండున్నర లక్షల డాలర్ల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.
విజయ్, వెంకటరమణ, సతీష్ కలిసి ప్రొక్యూర్, క్రిప్టో అనే రెండు ప్లేస్మంట్ సంస్థలు నడుపుతున్నారు. వెంకటరమణ, ఫెర్నాండో కలిసి మరో కంపెనీని నడుపుతున్నారు. ఆ మరో కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లు దొంగపత్రాలు సృష్టించి హెచ్1బి వీసాకు దరఖాస్తు చేస్తారు. మంజూరయిన వీసాలపై అమెరికా వచ్చిన వారిని రిజర్వులో ఉంచి ఎప్పుడు ఎక్కడ ఖాళీలు వస్తే అక్కడ వారితో భర్తీ చేస్తారు.
ఈ నలుగురిపై వీసా అక్రమాలకు పాల్పడేందుకు కుట్ర చేశారన్న అభియోగం మోపారు. ఈ నేరం రుజువయితే అయిదేళ్ల వరకూ జైలుశిక్ష, 2,50,000 డాలర్ల వరకూ జరిమానా విధించవచ్చు.