న్యూఢిల్లీ: నోయిడాలో పక్కపక్క అనుకుని ఉన్న రెండు ఆకాశహర్మ్యాల మధ్య అడుగున్నర వెడల్పు ఖాళీ స్థలంలో ఒక 19 సంవత్సరాల యువతి మృతదేహం దొరికింది. బీహర్లోని కథీహార్ జిల్లాకు చెందిన ఆ యువతి జూన్ 28వ తేదీ నుంచి కనబడడం లేదు. ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
అయితే పోలీసులకు అంతుబట్టని విషయం ఏమంటే 120 అడుగుల ఎత్తున ఆ కాస్త ఖాళీ జాగాలోకి శవం ఎలా వెళ్లిందనేది. మృతదేహాన్ని కిందకు దించేందుకు పోలీసులు జాతీయ విపత్తు రక్షణ దళం సహాయం కోరారు. నోయిడా సెక్టార్ 76లోని ఆమ్రపాలి సిలికాన్ సొసైటీలో ఈ సంఘటన జరిగింది. యువతి అక్కడి ఒక అపార్ట్మెంట్లో పనిమనిషిగా చేస్తోంది. శవం నుంచి తీవ్రమైన దుర్ఘంధం వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ అపార్ట్మెంట్లో ఉండే జంట పని మీద గురుగ్రామ్ వెళ్లారు. వారికి విషయం తెలియగానే శవాన్ని గుర్తు పట్టేందుకు వెనక్కువచ్చారు. 35 మంది సభ్యుల విపత్తు రక్షణ దళం బృందం రాత్రి పన్నెండున్నర గంటలకు రంగంలోకి దిగి రెండున్నర గంటలు శ్రమించి మృతదేహాన్ని కిందకు దించారు. దానికి వారు గోడను పగలగొట్టాల్సి వచ్చింది.