గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ఓల్డ్ మలక్పేట డివిజన్ లో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ డివిజన్లో సీపీఐ అభ్యర్థి ఫాతిమా ఎన్నికల గుర్తు తప్పుగా ముద్రితం అవ్వడంతో ఈ నెల 1వ తేదీన పోలింగ్ రద్దు అయిన విషయం తెలిసిందే. ఓల్డ్ మలక్పేట డివిజన్ లో 69 కేంద్రాలలో ఉదయం 7గంటల నుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. డివిజన్ పరిధిలోని ప్రజలు ఓటింగ్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఉదయం 9 గంటల వరకూ 4.44 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. 276 మంది అధికారులు పోలింగ్ విధుల్లో ఉన్నారు. ఇక్కడ రిటర్నింగ్ అధికారిని మార్పు చేశారు. రిటర్నింగ్ అధికారి సంధ్యారాణిని బాధ్యతల నుండి తప్పించి ఆమె స్థానంలో శైలజ అనే అధికారిణిని ఇఆర్ఓగా ఎన్నికల అధారిటీ లోకేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.
భారీ ఫోలీస్ భద్రత మద్య రీపోలింగ్ జరుగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్విక్ రియాక్షన్ టీమ్ అందుబాటులో ఉన్నారు. ఓల్డ్ మలక్పేటలో మొత్తం ఓటర్లు 54,655 మంది కాగా పురుషులు 27,889, మహిళలు 26,763 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. 12 మంది మైక్రో అబ్దర్వర్లను నియమించారు. దాదాపు 23 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ను ఏర్పాటు చేశారు. మరో వైపు నగర అదనపు పోలీస్ కమిషనర్ చాహర్ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షించారు.
మంగళవారం పోలింగ్ నిలిపివేసే సమయానికి 3450 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో నేడు రీపోలింగ్లో ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలు కాకుండా మధ్య వేలికి సీరా చుక్క వేస్తున్నారు. రీపోలింగ్ సందర్భంగా ఆ ప్రాంతంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటించారు.