గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహాం కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి లో నీటి మట్టం 54.6 అడుగులు ఉండగా, 15.08 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు సాయంత్రానికి 55 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పాటు ఇంద్రావతి, ప్రాణహిత, కిన్నెరసాని, తాలిపేరు, శబరి వంటి ఉప నదులు పొంగిపొర్లుతుండటంతో నదిలో ప్రమాదకర స్థాయిని మించి ప్రవాహం కొనసాగుతోంది.
దవళేశ్వరం బ్యారెజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 46 అడుగుల నీటి మట్టం ఉండగా, ఇన్ ఫ్లో 14,41,284 క్యూసెక్కులు ఉండగా అంతే మొత్తంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రభావంతో విలీన మండలాల్లోని గ్రామాలు మళ్లీ జల దిగ్బంధంలోకి చేరుకున్నాయి. కుక్కనూరు, వేరేరుపాడు మండలాల్లోని రహదారులు నీట మనగడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వదర ఉదృతి నుండి ఇప్పుడిప్పుడే గ్రామాలు కోలుకుంటుంగా మళ్లీ మరో సారి వరద పోటెత్తడం గోదావరి పరివాహక గ్రామాల ప్రజలను ఆందోళన కల్గిస్తొంది.
గోదావరి వరద ఉదృతికి కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, సఖినేపల్లి, ముమ్మడివరం, ఐ పోలవరం మండలాలపై వరద ప్రభావం చూపింది. కాజ్ వేలు, లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి. ఆయా మండలాల్లోని లంక భూములతో పాటు తూర్పు గోదావరి జిల్లా పెరవలి, తాళ్లపూడి, నిడదవోలు, కొవ్వూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల పంట భూములు ముంపునకు గురయ్యాయి.