తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ కరోనా హాట్స్పాట్గా మారింది. ఈ హోటల్లో పని చేస్తున్న 85 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి జె. రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.
డిసెంబర్ 15వ తేదీన ఆ హోటల్లో పని చేస్తోన్న ఒక చెఫ్కు కరోనా పాజిటివ్ తేలగా.. ఇప్పటిదాకా సేకరించిన మొత్తం 609 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 85 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని ఆయన అన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారని.. వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అలాగే వారితో కాంటాక్ట్ అయినవారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారని ఆయన చెప్పారు.కాగా ఫైవ్ స్టార్ హోటల్ అయిన గ్రాండ్ చోళాకు తరచూ పార్టీలు కూడా జరుగుతుంటాయి.డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి కూడా అక్కడ పార్టీలు జరిగినట్టు సమాచారం.ఏకంగా ఎనభై అయిదు మంది సిబ్బందికి కరోనా సోకడంతో వారెవరైనా ఈ మధ్యకాలంలో పార్టీలకు సర్వ్ చేశారా ఇంకేదైనా విధుల్లో ఉన్నారా అన్న విషయమై ఆరా తీస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా పోలీసులు, కార్పోరేషన్ అధికారులు గ్రాండ్ చోళా పై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అలాగే అటు నగరంలోని మిగతా 25 లగ్జరీ హోటళ్లలోనూ కరోనా టెస్టులు చేస్తున్నట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
గ్రాండ్ చోళ హోటల్ వివరణ
కాగా, హోటల్లో నిర్వహించే అన్ని కార్యక్రమాలకు కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నామని పేర్కొంటూ ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ ఉద్యోగులు ఎక్కువ మంది ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారని స్పష్టం చేసింది.ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాజమాన్యం పేర్కొంది.