ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలో ఆదివారం ఘోర దుర్ఘటన జరిగింది. ఘజియాబాద్ జిల్లా మురద్నగర్లోని శ్మశానవాటిక పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది.. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, 40మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలిసిన వెంటనే పోలీస్, పైర్ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాలను తొలగించి క్షతగాత్రులను ఘజియాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 14 మంది మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.
దయానంద్ కాలనీలో నివసిస్తున్న దయారామ్ అనారోగ్యంతో శనివారం రాత్రి మరణించారు. ఆయన అంత్యక్రియలకు 100 మందికి పైగా స్థానికులు, బంధువులు హాజరయ్యారు. దహన మైదానంలో నిర్మించిన భవనం లోపల వచ్చిన వారు మృతుడి ఆత్మ శాంతికి ప్రార్థన చేస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదం నుండి అక్కడివారు తప్పించుకునే అవకాశం లేక శిధిలాలలో చిక్కుకుని ఆర్థనాదాలు చేశారు. కొందరు అక్కడి నుండి పరుగులు తీసి ప్రాణాలను రక్షించుకున్నారు.
ఘటనపై యూపి సీఎం యోగి అదిత్యనాధ్ దాస్ దిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.