హైదరాబాద్ : ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి హైదరాబాదు యువతి సోనీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన నిందితుడు రవిశేఖర్ను ఒంగోలు శివారులో మంగళవారం అరెస్టు చేశారు. నిన్న రాత్రి ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆ యువతిని కిడ్నాపర్ విడిచిపెట్టగా ఆమె హైదరాబాద్ చేరుకొని హయత్నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హైదరాబాదు పోలీసులు అధికారులు ప్రకాశం జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. ఒంగోలు శివారులో రవిశేఖర్ను గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు.
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన రవిశేఖర్పై గుంటూరు, విజయవాడ, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 26 చోరీ కేసులు నమోదు అయి ఉన్నాయి.
ఈ నెల23వ తేదీన హైదరాబాద్ శివారు హయత్నగర్కు చెందిన 21ఏళ్ల బిఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ చేశాడు. రాచకొండ పోలీసులు ఈ కిడ్నాప్ కేసును తీవ్రంగా పరిగణించి నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. ఫోటోతో సహా నిందితుడి వివరాలు ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు స్టేషన్లకు పంపడంతో పాటు నిందితుడి ఆచూకీ చెబితే లక్ష రూపాయల బహుమతి కూడా ప్రకటిస్తూ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో భయపడిన పోయిన నిందితుడు రవిశేఖర్ నిన్న రాత్రి ఆ యువతిని ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద వదిలివెళ్లాడు.