న్యూఢిల్లీ: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉన్న ఉన్నావ్ అత్యాచారం కేసు బాధితురాలి దైన్యం ప్రకంపనలు రేపుతోంది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వెళ్లి బాధితురాలిని చూశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందనీ, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ తరలించాలనీ అన్నారు.
‘ఫర్ గాడ్స్ సేక్, ప్రధానమంత్రిగారూ, ఈ క్రిమినల్కీ, అతని సోదరుడికీ మీ పార్టీ నుంచి అందుతున్న రాజకీయప్రాపకం ఆపండి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు’ అని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ ట్వీట్ చేశారు. రెండేళ్ల క్రితం మైనర్ బాలికను తాను రేప్ చేయడమే కాకుండా ఇతరులకు కూడా అప్పగించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి శాసనసభ్యుడు కులదీప్ సెనగర్ ఈ కేసులో ఒక ఏడాదిగా జైలులో ఉన్నాడు. అయినా భారతీయ జనతా పార్టీ అతనిపై ఇంతవరకూ ఎలాంటి చర్యా తీసుకోలేదు.
సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా బిజెపిపై వ్యగ్యాస్త్రాలు సంధించారు. ‘బిజెపి చాలా సంస్కారం ఉన్న పార్టీ. చాలా క్రమశిక్షణ గలిగిన పార్టీ. మరి ఈ కేసులో ఎప్పుడు వారు దర్యాప్తు చేస్తారో’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లోని బిజెపి ప్రభుత్వ యంత్రాంగమంతా సెనగర్కు మద్దతుగా ఉందంటూ, అతనితో రాజీకి రావల్సిందిగా పోలీసులు బాధితురాలి కుటుంబంపై వత్తడి తెచ్చారన్న సంగతి ప్రస్తవిస్తూ, ఆదిత్యనాధ్ ప్రభుత్వాన్ని ఎప్పటికీ విశ్వసించలేమని ఆయన అన్నారు. ఈ మొత్తం వ్యవహరంపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేయించాలని ఆయన కోరారు