అమరావతి: ‘స్పందన’ కార్యక్రమంలో అర్జీ ఇస్తే సమస్యలు సత్వరం పరిష్కారం అవుతున్నాయని ప్రజలు భావిస్తున్నందున దీనికి విశేష స్పందన లభిస్తోందనీ, ఇదే స్పూర్తిని అధికారులు కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం కలెక్టర్లు, ఎస్పిలతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ వారికి పలు సలహాలు, సూచనలు అందించారు.
స్పందనలో వచ్చిన అర్జీలను కలెక్టర్లు సీరియస్గా చూస్తున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిందనీ, అందుకే ధరఖాస్తుల సంఖ్య పెరిగిందని జగన్ అన్నారు. అవినీతి అనేది ఏ స్థాయిలోనూ ఉండకూడదని జగన్ సూచిస్తూ ఉన్నతాధికారులు ప్రతి సమీక్షా సమావేశాల్లో ఈ విషయాన్ని మండల స్థాయి అధికారులకు తెలియజేయాలన్నారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
ఉంటాయని హెచ్చరించాలని జగన్ తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో భోజనం నాణ్యతపై దృష్టి పెట్టాలనీ, పాత బకాయిలు అన్నింటినీ విడుదల చేయాలని జగన్ ఆదేశించారు.
సెప్టెంబర్ నుండి కొత్త ఇసుక పాలసీ అమలులోకి వస్తుందనీ, అన్ని ర్యాంపుల వద్ద వీడియో కెమెరాలు ఉంటాయని జగన్ తెలిపారు. ఇసుక ర్యాంపుల సంఖ్య పెంచి ఎక్కడా కొరత లేకుండా చూడాలనీ, పారదర్శకంగా విధానం అమలు చేయాలని సిఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలకు భవనాలను గుర్తించాలనీ, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను సవ్యంగా జరపాలని జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో అడిగిన వారికి అడిగినట్లు రేషన్ కార్డు ఇచ్చేట్టుగా ఉండాలని జగన్ సూచించారు. ప్రజల సంతృప్తి పెంచేలా పథకాలు అమలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.