ఏపి ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఆదిత్యనాధ్ దాస్ నియమితులైయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త సీఎస్ని నియమించింది. కాగా సీఎస్ నీలం సాహ్ని సేవలు కొనసాగించుకోవాలని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆమెను ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు.
బీహార్కు చెందిన ఆదిత్యనాధ్ దాస్ 1987 బ్యాచ్కు చెందిన ఐఎఎస్ అధికారి. ప్రఖ్యాత బెనారస్ హిందూ యూనివర్శిటీలో బీఎస్సీ హానర్స్ పూర్తి చేసిన ఆదిత్యనాధ్ దాస్ ఢిల్లీలోని జెఎన్యూలో ఇంటర్నేషనల్ స్టడీస్ చేశారు. గతంలో ఆయన విజయనగరం, విజయవాడ అసిస్టెంట్ కలెక్టర్గా, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్గా, వరంగల్లు కలెక్టర్గా మురికివాల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్, మున్సిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్, నీటి పారుదల శాఖ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గా బాధ్యతలు నిర్వహించారు.
ప్రస్తుత సీఎస్ బాధ్యతలకు సీనియారిటీలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రమణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జెఎస్వి ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ లు ఉన్నప్పటికీ వీరిలో కొందరు కేంద్ర సర్వీసులో ఉండటం, కొందరు సీఎస్గా వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో పాటు సీఎం వైఎస్ జగన్..ఆదిత్యనాధ్ వైపు మొగ్గుచూపారని సమాచారం. అధిత్యనాధ్ దాస్ 2022 జూన్లో రిటైర్ కానున్నారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం నుండి ఆంధ్రకు వచ్చిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని మున్సిపల్ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపి సంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కే సునీత నియమితులయ్యారు.