చైనా చేతులారా చేసుకుంటున్న పనులు భారత్ కు లాభించేలా కనిపిస్తున్నాయి. మనతో తగువు పెట్టుకుంటున్న చైనాకు అమెరికా నుంచి మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ – చైనా అంశంలో భారత్ కే అమెరికా అండగా నిలుస్తోంది. ఇక త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా ఉన్న భారతీయుల ఓట్లు ప్రభావితం అవుతాయి. ఈనేపథ్యంలో వారిని ఆకర్షించేందుకైనా భారత్ కు అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో భారత్ – అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే అమెరికా, భారత్ మధ్య వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, అమెరికా సెక్రటరీ ఆఫ్ కామర్స్ విల్బర్ రైస్ మధ్య ప్రాధమిక పరిమిత ట్రేడ్ ప్యాకేజీతో పాటు వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య రంగాల్లోని వివాదాలు పరిష్కరించుకోవాలని చూస్తున్నాయని సమాచారం. రెండు దేశాల మధ్య ఆరోగ్యకర స్నేహ హస్తం ఉండాలనే అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. భారత్ లోని మానవ వనరులకు ఆమెరికా ఆర్క వ్యవస్థ తోడైతే మంచి ఫలితాలు రాబట్టొచ్చని అంచనా వేస్తున్నారు.
భారత్ వైపు అమెరికా చూడడానికి రాజకీయ కారణాలు ఎక్కువగా ఉన్నాయి, కరోనాతో చైనాపై, చైనాతో దోస్తీ కారణంగా పాక్ పై అమెరికా కోపానికి కారణాలవుతున్నాయి. గతంలో భారత్ కంటే పాక్ కే ఎక్కువ సాయం చేసేది అమెరికా. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. భారత్ – అమెరికా మధ్య స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం జరిగితే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. అనేక ఉత్పత్తులు, సేవలపై ఆంక్షలు, అధిక పన్నులు ఉండవు. వ్యవసాయం నుంచి ఐటీ వరకూ ఎగుమతులు, దిగుమతులు మెరుగ్గా ఉంటాయి. 2018-19లో అమెరికా-భారత్ మధ్య 88 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగితే.. 2019-20కి 100 బిలియన్లకు చేరిందని తెలుస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే జరిగినే ఈ విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.