ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న మంకీ పాక్స్ వైరస్ .. ఇప్పుడు మన దేశంలోనూ ఆందోళనను కల్గిస్తొంది. భారత్ లో తొలి మంకీ పాక్స్ మరణం నమోదైంది. కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా పున్నియార్ లో 22 ఏళ్ల యువకుడు మంకీ పాక్స్ వైరస్ తో చనిపోయాడు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వీనా జార్జ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మృతి చెందిన యువకుడు యూఏఈ నుండి జూలై 22న భారత్ వచ్చాడనీ, ఇక్కడికి రావడానికి ఒక రోజు ముందే పరీక్షలు నిర్వహించగా అక్కడే మంకీ పాక్స్ నిర్దారణ అయ్యిందని మంత్రి తెలిపారు. మంకీపాక్స్ కేసుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. కాగా ఈ మరణానికి సంబంధించిన రిపోర్టు అలప్పూజలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండి ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మంకీ పాక్స్ ప్రాణాంతకం కాదనీ, ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్నా మరణాల రేటు చాలా తక్కువని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.
మరో వైపు దేశంలో ఇప్పటి వరకూ మొత్తం నాలుగు మంకీ పాక్స్ కేసులు నమోదు కాగా అందులో మూడు కేరళలోనే నమోదు కావడం గమనార్హం. భారత్ లో మొదటిగా నమోదైన మంకీ పాక్స్ బాధితుడు ఆసుపత్రిలో చికిత్స అనంతరం పూర్తిగా స్వస్థత చేకూరడంతో శనివారం నాడే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.