న్యూఢిల్లీ: శుక్రవారం నుంచి ఢిల్లీలో షూటింగ్ ప్రపంచకప్ జరగనుంది. ఈ పోటీల్లో పాకిస్థాన్ షూటర్లు కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే, పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్ షూటర్లకు భారత ప్రభుత్వం వీసాలు నిరాకరించింది. కాగా, భారత చర్యపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఒసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేగాక, తాజా చర్యతో భవిష్యత్లో అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్తో చర్చలను నిలిపివేయాలని ఐఒసీ నిర్ణయించింది. దీంతో పాటు ఢిల్లీలో జరిగే ప్రపంచకప్ పోటీల నుంచి పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్ ఈవెంట్కు ఒలింపిక్ అర్హత హోదాను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
ఒలింపిక్ ఛార్టర్ విధివిధానాలకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ప్రవర్తించిందని ఐఓసీ మండిపడింది. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అన్ని దేశాల అథ్లెట్లను, క్రీడా ప్రతినిధులను సమానంగా చూడాలని ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది. అథ్లెట్ల మధ్య ఆతిథ్య దేశం ఎలాంటి వివక్ష చూపించకూడదని, ఆ దేశ రాజకీయ జోక్యం కూడా ఉండరాదని వెల్లడించింది.
అయితే, భారత్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్లే ఆ దేశంతో చర్చలు నిలిపివేసేందుకు నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఇకపై ఒలింపిక్ ఛార్టర్ నిబంధనలకు అనుగుణంగా విదేశీ పోటీదారులకు అనుమతి కల్పిస్తామని భారత ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వచ్చేంతవరకు ఒలింపిక్ సంబంధింత పోటీలు నిర్వహించేందుకు ఆ దేశానికి అనుమతి ఇవ్వబోమని ఐఒసీ స్పష్టం చేసింది.