అమరావతి: ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం పోలింగ్ సరళిపై సమీక్షా సమావేశం జరిపారు. నియోజకవర్గాల వారీగా జనసేనకు లభించిన ఓట్ల శాతం గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. మరో 11రోజులలో ఎన్నికల ఫలితాలు వెల్లడి అవ్వనున్న నేపథ్యంలో పోలింగ్ తరువాత మొట్టమెదటి సారిగా పోటీ చేసిన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు తమకు ఇన్ని స్థానాలు వస్తాయి అంటే తమకు ఇన్ని స్థానాలు వస్తాయి,అధికారం కైవసం చేసుకోబోతున్నామంటూ ప్రకటించుకున్నా జనసేన ఇప్పటి వరకూ ఇన్ని స్థానాల్లో కైవసం చేసుకుంటామని ప్రకటించలేదు.
అధికార ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అనేక రకాలు వ్యూహాలను రచించుకున్నా జనసేన మాత్రం జిరో బడ్జెట్ పాలిటిక్స్ అజెండాతోనే ముందుకు సాగింది. ఈ కారణంగా నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి, అంచనాలపై అభ్యర్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ నెల 23న కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ ఏజంట్ల నియామకం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సూచనలు చేసినట్లు సమాచారం.
అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు డబ్బులతో ప్రలోభాలకు గురి చేసినా కొన్నివర్గాలకు చెందిన ప్రజలు, యువత, మహిళలు సమాజం, రాజకీయాల్లో మార్పు కోసం నిలబడిన జనసేనను ఆదరించారనీ పలువురు అభ్యర్థులు తెలియజేసినట్లు సమాచారం.
గెలుపు ఓటములను పట్టించుకోకుండా గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారంపై జనసైనికులు దృష్టి సారించాలనీ, రాబోయే స్థానిక సంస్థల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు.
ఈ సమావేశంలో నేతలు మాదాసు గంగాధరం, నాదెండ్ల మనోహర్, రావెల కిషోర్బాబు, చింతల పార్థసారధి, హరిప్రసాద్, డిఎంఆర్ శేఖర్, రాపాల వరప్రసాద్ తదితర ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.