రెండేళ్ల నుంచే పథకాలపై చర్చలు
నా ఇమేజి వెనుక 45 ఏళ్ల కష్టం
నా కేబినెట్ భేటీ సగటున 3 గంటలు
హిందూ ఉగ్రవాదం, దొంగ తప్పు కాదు..
అవినీతిపరులంటే మాత్రం తప్పా?
ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంటర్వ్యూలో మోదీ
తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందే 45 దేశాలు తిరిగానని, విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఎలా వెళ్లాలో తనకెవరూ చెప్పక్కర్లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కిసాన్ సమ్మాన్ లాంటి పథకాలు ఇప్పటికిప్పుడు పెట్టినవి కావని, వాటిపై రెండేళ్ల నుంచి చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అవతలి వాళ్లు ‘హిందూ ఉగ్రవాదం, దొంగలు’ అంటే తప్పు లేదు గానీ, తాను ‘అవినీతిపరులు’ అంటేనే కొంపలు మునిగిపోయాయా అని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పత్రికకు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. వాటిలో ముఖ్యాంశాలు కొన్ని ఇలా ఉన్నాయి…
తమను ఓడించాలని మీడియా, ఎన్నికల పండితులు, ధనవంతులు, ఖాన్ మార్కెట్ గ్యాంగ్.. అందరూ చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు మూడింటిలో కలిపి తమకు కేవలం 40 సీట్లే వస్తాయని చెబుతున్నారని మండిపడ్డారు. పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సహజంగానే కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని, కానీ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్ల కంటే తమవే ఎక్కువని ఆయన చెప్పారు. వాళ్లేదో చేస్తారని ప్రజలు అనుకున్నారని, కానీ అధికారంలోకి రాగానే వాళ్ల పాత బుద్ధులు బయట పడుతున్నాయని ఎద్దేవా చేశారు. నోట్లకట్టలు చేతులు మారుతున్న విషయం దేశమంతా వైరల్ అయిందన్నారు.
రాత్రికి రాత్రి కాదు..
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు, పీఎంకిసాన్ యోజన, ఉద్యోగులకు పన్ను ప్రయోజనాలు, అసంఘటిత రంగానికి పింఛన్ల లాంటి పథకాలపై రెండేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని, అవి రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయాలు కావని అన్నారు. ఎన్నికలకు, వాటికి సంబంధమే లేదని ప్రధాని తెలిపారు. తన పరువు ప్రతిష్ఠలు, తనకున్న పేరు వెనుక 45 ఏళ్ల కష్టం దాగి ఉందని, దాన్ని ఖాన్ మార్కెట్ గ్యాంగ్ లేదా ఢిల్లీలోని ధనవంతులు సృష్టించలేదని అన్నారు. రాత్రికి రాత్రే దాన్ని పడగొట్టాలనుకుంటే ఎవరికీ సాధ్యం కాదన్నారు.
అది వాళ్లకూ తెలుసు
ప్రతిపక్ష నాయకులకు తాను ఇచ్చినంతగా సమయం ఇచ్చిన ప్రధాని వేరెవరూ లేరని, ఆ విషయం వాళ్లకు కూడా తెలుసని మోదీ చెప్పారు. ఎన్నికలు కాబట్టి రాజకీయాల కోసం అలా మాట్లాడుతున్నారని మమత, చంద్రబాబు తదితరులపై విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు జరిగేటపుడు అన్ని పార్టీలకు చెందిన 40-45 మంది ఎంపీలతో రోజూ మాట్లాడుతుంటానని, ప్రజాస్వామ్యంలో అది ముఖ్యమని అన్నారు. ఫొని తుపాను వచ్చినపుడు తాను నవీన్, మమత ఇద్దరికీ ఫోన్లు చేశానని, ఎన్నికల కార్యక్రమాలు పక్కన పెట్టి విపత్తు నిర్వహణ యంత్రాంగంతో సమీక్షలు జరిపానని అన్నారు. తుపాను ఇంకా వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండగానే వారిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. కేరళలో ఆలయంలో టపాసులు పేలి 18 మంది మరణించినపుడు ఢిల్లీ నుంచి అత్యుత్తమ వైద్యులను తీసుకుని తాను తక్షణం అక్కడకు వెళ్లానని గుర్తుచేశారు.
3 గంటలు..
మన్మోహన్ సింగ్ హయాంలో కేబినెట్ సమావేశానికి సగటున 20 నిమిషాలు సమయం పట్టేదని, కానీ తనకు సగటున 3 గంటలు పడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. చర్చలో అనేక అంశాలు వెనక్కి పోతే వాటిని మంత్రుల బృందం చూసుకుంటుందని చెప్పారు. తమ కేబినెట్ సమావేశాలలో ప్రతి మంత్రి స్వేచ్ఛగా మాట్లాడొచ్చని అన్నారు. అక్కడే ప్రజంటేషన్లు కూడా చేస్తామని, ఇవన్నీమీడియాకు చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు.
అప్పుడూ ఇలాగే..
వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం రక్షణ రంగానికి సంబంధించిన స్కాం జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు చేసిందని, అవేవీ నిజం కాదని తేలిపోయిందని మోదీ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అలాగే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నిజమేంటో తమకు తెలుసని అన్నారు. పెద్దనోట్ల రద్దు అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్న అతిపెద్ద చర్య అని, దాంతో నల్ల ధనం చాలావరకు వెలుగులోకి వచ్చిందని చెప్పారు. 1.30 లక్షల నల్లధనం బయటకు వచ్చిందని, 3.8 లక్షల షెల్ కంపెనీలను గుర్తించి వాటిని రద్దుచేశామని అన్నారు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 2013-14లో 3.8 కోట్లు ఉంటే, అది 2017-18లో 6.8 కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు.
20 వేల ఎన్జీవోల మూత
విదేశీ నిధుల నియంత్రణకు కాంగ్రెస్ హయాంలోనే ఒక చట్టం వచ్చిందని, అది తాను తెచ్చింది కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేవలం ఒక ఖాతా చూపించమని అడిగితే ఇవ్వలేదని.. దాంతో 20వేల స్వచ్ఛంద సంస్థలను మూసేశామని తెలిపారు. తాను తినను, ఎవరినీ తిననివ్వనని స్పష్టం చేశారు.
ఇవన్నీ వార్తలు కావా?
జమ్ము కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన తర్వాత 100 శాతం విద్యుదీకరణ జరిగిందని, ఈసారి ఎన్నికల్లో అక్కడ ఒక్క హింసాత్మక ఘటన కూడా జరగలేదని.. ఇవేవీ మీడియాకు వార్తలు కావా అని మోదీ ప్రశ్నించారు. పశ్చమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో 100 మందికి పైగా మరణించినా ఒక్క ముక్క లేదని అన్నారు. అంతకుముందు వరకు చొరబాట్లతో అల్లాడిన ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న విషయం పత్రికలలో ఎందుకు రావడం లేదన్నారు. మన పాత స్కూటరును రోజుకు నాలుగుసార్లు తుడుచుకుంటాం గానీ, ప్రభుత్వ బస్సులను మాత్రం తగలేస్తామని.. ఇదెక్కడి జాతీయవాదమని అన్నారు.
వాళ్లంతా ముస్లింలే కదా..
జాతీయవాదం అనేసరికి ముస్లింలు భయపడుతున్నారని ప్రస్తావించగా.. ఏపీజే అబ్దుల్ కలాం, సానియా మీర్జా, అబ్దుల్ హమీద్ (1965 యుద్ధవీరుడు).. వీళ్లంతా ముస్లింలు కారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ తీసుకున్నారని.. ఆ పదవిని ముస్లిం నాయకుడికి ఎందుకు ఇవ్వలేదని అడిగారు. రాజస్థాన్ లోని అల్వార్ లో దళిత బాలికపై అత్యాచారం జరిగితే, ఎన్నికలు ముగిసేవరకు ఆ విషయం పత్రికలలో ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు.
ఆ మాటంటే తప్పు వచ్చిందా?
రాజీవ్ గాంధీ అవినీతిపరుడని తాను అన్నందుకు కాంగ్రెస్ నేతలు, మీడియా గగ్గోలు చేశాయని చెప్పిన ప్రధాని.. తనపై వాళ్లు అన్నేసి మాటలు అంటే మాత్రం ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని అడిగారు. తనను దొంగ అని, హిందూ ఉగ్రవాది అని, మృత్యుబేహారి అని, రక్తంతో నిలువెల్లా తడిశారని అన్నా కూడా అవేవీ తప్పులుగా ఎవరికీ కనిపించలేదా అని ప్రశ్నించారు. ఒక మతం మొత్తాన్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించారని (హిందూ ఉగ్రవాదం), అది విద్వేష ప్రసంగం కాదా అని అడిగారు.
45 దేశాలు తిరిగా..
ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ప్రధానిగా తనకు ఎంతో ఉపయోగపడిందని మోదీ చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు ముందే 45 దేశాలు తిరిగానన్నారు. డెల్టా ఎయిర్ వేస్ వాళ్లు అప్పట్లో నెలకు 500 డాలర్లతో అపరిమిత ప్రయాణాలు పెట్టారని, దాన్ని తాను ఉపయోగించుకున్నంతగా ఎవరూ వాడలేదని తెలిపారు. తాను చాలా పక్కాగా ప్రయాణం ప్లాన్ చేసుకునేవాడినని, రాత్రిపూట విమానాలు ఎక్కి, వాటిలోనే 6 గంటలు పడుకోవడంతో హోటల్ అవసరం ఉండేది కాదన్నారు. విమానాశ్రయంలోనే రెడీ అయిపోయి, కాలింగ్ కార్డుతో ఫోన్ చేస్తే తనను అవతలివాళ్లు రిసీవ్ చేసుకునేవారని చెప్పారు. అలా ఒక్క అమెరికాలోనే 23 రాష్ట్రాలు చుట్టేశానని వివరించారు. విదేశాంగ మంత్రులకు కూడా ఎలా వెళ్లాలో పక్కనవాళ్లు చెబుతారని, తనకా అవసరం లేదని నవ్వుతూ చెప్పారు.
అన్నిచోట్లా భారత్
జి-20 సమావేశాలలో ఒక ముఖ్యమైన విషయాన్ని ఎవరూ గుర్తించలేదన్నారు. రెండు సమావేశాలు పక్కపక్కనే జరిగాయని , వాటిలో జై (జపాన్, అమెరికా, ఇండియా) ఒకటైతే రిక్ (రష్యా, ఇండియా, చైనా) మరొకటని అన్నారు. రెండు ప్రధాన చర్చలలోను ఉన్న ఒకే ఒక్కదేశం భారత్ అని.. మన దేశానికి దక్కుతున్న ప్రాధాన్యం ఇదని చెప్పారు. విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు మన రాయబారేనని అన్నారు.
(ఇండియన్ ఎక్స్ ప్రెస్ సౌజన్యంతో)