రాజమండ్రి : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి నేటికీ ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్బంగా రాజమండ్రిలో గురువారం ‘జనసేన ఆవిర్భావ సభ’ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
గత సంవత్సరం అక్టోబర్లో పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జనసేన కవాతు నిర్వహించారు. కవాతుకు భారీ స్పందన వచ్చింది. దీంతో పార్టీ ఆవిర్భావ సభను కూడా రాజమండ్రిలోనే నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.
స్థానిక ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సాయంత్రం మూడు గంటలకు సభా కార్యక్రమాలు మొదలవుతాయి. బుధవారం నుంచే పార్టీ ముఖ్య నేతలు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
13 జిల్లాల నుంచి జనసైనికులు భారీగా తరలివస్తారని నేతలు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సభకు వాహనాలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సభలోనే తన మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరుపున లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి విడత అభ్యర్థుల జాబితాను బుధవారం రాత్రి ప్రకటించారు. నాలుగు లోక్ సభ, 32 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించారు.