ఏపి సెక్రటేరియట్ లో సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో కాకర్ల వెంకట్రామిరెడ్డి వర్గం విజయం సాధించింది. ఇటీవల జరిగిన సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్స్ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్యానల్ ఓటమి పాలవ్వడంతో ఈ ఎన్నికలు ఉత్కంఠ గా మారాయి. ఇంతకు ముందు కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వెంకట్రామిరెడ్డికి ప్రభుత్వంలోని పెద్దలు, వైసీపీ నేతల ఆశీస్సులు, మద్దతు ఉండటంతో ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి గతంలో ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. అయితే వెంకట్రామిరెడ్డి అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత ఉద్యోగులు ఆశించిన విధంగా తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయలేదన్న భావనతో ఈ సారి ఆయనను ఏకగ్రీవం చేసేందుకు ఉద్యోగులు అంగీకరించలేదు.
సచివాలయ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈ సారి వెంకట్రామిరెడ్డికి పోటీగా రామకృష్ణ బరిలో నిలిచారు. దీంతో ఈ సారి పోటీ అనివార్యమైంది. వివిధ పదవులకు 30 మంది బరిలో నిలిచారు. బుధవారం పోలింగ్ రసవత్తరంగా సాగింది.మొత్తం 1225 ఓట్లు ఉండగా, 1162 మంది ఉద్యోగులు పోలింగ్ లో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకూ పోలింగ్ కొనసాగగా, కౌంటింగ్ అర్ధరాత్రి వరకూ జరిగింది. కార్యవర్గంలో వెంకట్రామిరెడ్డి మద్దతుదారులు అత్యధికులు విజయం సాధించారు.
అధ్యక్షుడుగా వెంకట్రామిరెడ్డి 280 ఓట్ల మెజార్టీతో రామకృష్ణపై విజయం సాధించారు. వెంకట్రామిరెడ్డికి 720 ఓట్లు రాగా, ప్రత్యర్ధి రామకృష్ణకు 432 ఓట్లు వచ్చాయి. మహిళా వైస్ ప్రెసిడెంట్ గా సత్య సులోచన, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గా ఎర్రన్న యాదవ్, అడిషనల్ సెక్రటరీగా గోపి కృష్ణ, మహిళా జాయింట్ సెక్రటరీగా ఆర్ రమాదేవి, జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) మనోహర్, స్పోర్ట్స్ సెక్రటరీగా సాయి, కోశాధికారిగా కే వెంకటరావు లు విజయం సాధించారు. విజయం సాధించిన వెంకట్రామిరెడ్డి ప్యానల్ ను ఉద్యోగులు అభినందించారు. సెక్రటేరియట్ అఫీసర్స్ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్యానల్ ఓటమి పాలైనా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయన తో పాటు ఆయన ప్యానల్ ఘన విజయం సాధించడంతో సచివాలయ ఉద్యోగుల్లో పట్టు నిలుపుకున్నట్లు అయ్యింది.