దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం రేసులో సీఎంగా అనుభవం లేకపోయినా గాని ముందు నుంచి కేసిఆర్ కంటే జగన్ మంచి ర్యాంకులు సాధిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కేసిఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టేటట్లు ఉన్న సందర్భాలు గతంలో మనం చూశాం.
ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో జగన్ సర్కార్ రాష్ట్రం లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇంటింటికీ పరీక్షల నిర్వహించి.. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసిన సీఎంగా పేరు తెచ్చుకోవడం, అదేవిధంగా కరోనా చికిత్స ఆరోగ్యశ్రీలో చేర్చటం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి నట్లు అయింది. ఇదిలా ఉంటే తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం జగన్ సర్కార్ ని ఇబ్బందులపాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్.
మేటర్ లోకి వెళ్తే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య మరియు ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎప్పటి కోటా అమలు అవుతుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ కోటాను అమలు చేయటం లేదు. ఇదిలా ఉంటే తాజాగా కేసీఆర్ సర్కార్ ఇటీవల కొద్దిగా మోడీకి అనుకూలంగా నడుస్తూ ఉన్న నేపథ్యంలో 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేయడానికి రెడీ అయింది. దీంతో ఏపీలో బీజేపీ నేతలు జగన్ సర్కార్ ని 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరిట తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని వెనుకబడిన వర్గాలను ఆదుకోవాలి అంటూ సరికొత్త రాగం ఎత్తుతున్నారు.