తిరువనంతపురం, జనవరి 25: శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని 50సంవత్సరాలలోపు మహిళలు 17మంది మాత్రమే దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం తాజాగా మరో నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది.
అన్ని వయస్సుల వారు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకోవచ్చని సుప్రీం కోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పును వ్యతిరేకిస్తూ హిందూత్వవాదులు, అయ్యప్ప భక్తులు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.
ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నా జనవరి రెండవ తేదీన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు 50సంవత్సరాల లోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు.
ఆ ఇద్దరే కాకుండా మరో 51మంది 50సంవత్సరాల లోపు మహిళలు శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారని కేరళ ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టుకు నివేదించింది. ఆ జాబితాలో పురుషుల పేర్లు, ఎక్కువ వయస్సు ఉన్న వారి పేర్లు ఉండటాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ వెలుగులోకి తీసుకువచ్చింది.
ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కొత్త నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. 50ఏళ్ల లోపు మహిళలు 17మంది మాత్రమే శబరిమల దేవుడిని దర్శించుకున్నారని ఈ నివేదికలో పేర్కొంది.