రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసు విషయంలో కేరళకు చెందిన హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విషయంపై జోమున్ ఎందుకు స్పందించారు అంటే దానికి ఒక కారణం ఉంది. కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో నిందితులకు శిక్ష పడటంలో, సీబీఐ సాక్షాధారాలు సంపాదించడంలో జోమున్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. సిస్టర్ అభయ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులు కేసును క్లోజ్ చేసిన తరువాత కూడా జోమున్ ఎంటరై కేసును రీ ఓపెన్ చేయించి సీబీఐ దర్యాప్తు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కృతకృత్యులైయ్యారు.
నెలల తరబడి సీబీఐ దర్యాప్తు జరుపుతున్నా వివేకా హత్య కేసులో అసలు నిందితులను ఇంత వరకూ శిక్ష పడకపోవడంతో వివేకా కుమార్తె ఇటీవల జోమున్ ను కలిసి దీనిపై చర్చించినట్లు సమాచారం. దీంతో వివేకా హత్య కేసు విషయపై జోమున్ స్పందించారు. వివేకా హత్య విషయంలో పలు అనుమానాలు ఉన్నాయనీ, లోతైన కుట్ర దాగి ఉందని అన్నారు. అనుమానాలపై ఇప్పుడే మాట్లాడటం సరికాదనీ, రెండు నెలల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు జోమున్. ఆ సమావేశంలోనే తన వద్ద ఉన్న సాక్షాధారాలను బయట పెడతానని వెల్లడించారు. ఢిల్లీలోని ఓ తెలుగు న్యూస్ ఛానల్ తో మాట్లాడిన సందర్భంలో ఈ విషయాలను తెలిపారు. మూడు రోజుల క్రితం వివేకా కుమార్తె డాక్టర్ సునీత తనను కలిసి తండ్రి హత్య గురించి చర్చించారని జోమున్ పేర్కొన్నారు. సీబీఐకి సాక్షాధారాల సేకరణలో ఎలా సాయం చేయాలన్న విషయంపై చర్చించినట్లు చెప్పారు జోమున్, వివేకా హత్య కేసులో నిందితులకు తప్పకుండా శిక్ష పడేలా చేస్తామని ఆయన అన్నారు.
కేరళ సిస్టర్ అభయ హత్య కేసును తాను తిరగదోడి దర్యాప్తు చేయిస్తున్న సందర్భంలో నేరానికి పాల్పడిన చర్చి ఫాదర్ తనపై హత్యాయత్నంకు ప్రయత్నించారనీ, అయితే తాను గాయాలతో బయటపడ్డానని తెలిపారు. చివరకు నిందితులకు శిక్ష పడిందని జోమున్ పేర్కొన్నారు. సిస్టర్ అభయ హత్య కేసులో నిందితులకు శిక్ష పడటంతో కీలక పాత్ర పోషించిన జోమున్ ఇప్పుడు వివేకా హత్య కేసు గురించి మాట్లాడటం, సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపిలో హాట్ టాపిక్ అవుతోంది.