ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన కొడాలి నాని గత కొద్దికాలంగా ఆసక్తికర పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్నారు.
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడంలో ముందుండే కొడాలి నాని కామెంట్లు ఇటీవల సొంత పార్టీకి సైతం షాక్గా మారుతున్నాయనే టాక్ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు స్వపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయనే చర్చ జరుగుతున్న సమయంలోనే తాజాగా మరో వివాదంలో ఆయన పేరు వినిపిస్తోంది.
వైఎస్ జగన్ ఎంత గుర్తింపు ఇచ్చారంటే…
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ సహా బాబు కోటరీపై మంత్రి కొడాలి నాని అంతెత్తున ఫైర్ అవుతారు. చంద్రబాబు సహా టీడీపీలో తనకు గిట్టని వారిని ఓ రేంజ్లో టార్గెట్ చేస్తుంటారు. వైసీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడాలి నానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో తనకు అప్పగించిన బాధ్యతల ప్రకారం తన గళాన్ని నాని మరింత వినిపిస్తున్నారు. అయితే, అది కాస్త రూట్ మారింది.
ఆనాటి నుంచి కొడాలి నాని...
ఆదిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసు గెలుచుకునే రీతిలో కొడాలి నాని కామెంట్లు ఉన్నాయంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు మూడు రాజధానుల అంశానికి మద్దతు తెలియజేసే విషయంలో తటపటాయించారు. స్థానికుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని సైలెంట్గా ఉన్నారు. ఇక్కడి ఓట్లతో గెలిచి ఇక్కడి నుంచి హైకోర్టు, సెక్రటేరియట్ తరలించడానికి మద్దతు ఇవ్వడం ఎలా అని వారు తర్జన భర్జన పడ్డారు. అయితే మంత్రి కొడాలి మూడు రాజధానులకు మద్దతు తెలియజేశారు. ఈ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తటపటాయిస్తున్న సమయంలో ఆయన వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని బాహాటంగానే సమర్థించి జగన్ మనసు గెలుచుకున్నారు. అయితే, తర్వాతే పరిణామాలు మారిపోయాయని అంటున్నారు.
డిక్లరేషన్ దెబ్బకొట్టింది
తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ సమర్పించడం అనే అంశంలో కొడాలి నాని తీరు చర్చనీయాంశంగా మారిందంటున్నారు. ఏ గుడికి, మసీదుకి, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని కొడాలి నాని ప్రశ్నించారు. సీఎం హోదాలో వెళ్లే వారిని డిక్లరేషన్ అడిగే హక్కు లేదన్న ఆయన ఎక్కడలేని సంప్రదాయం తిరుమల లో మాత్రం ఎందుకు!? దాన్ని తీసేయాలని అన్నారు. సంతకం పెట్టకుండా శ్రీవారి గుడికి వెళ్తే తిరుమల అపవిత్రం అవుతుందా!? అని నాని ప్రశ్నించారు. నిజమైన హిందు వాదులు, మతం కోసం జీవితాలను ఇచ్చిన వారి నుంచి అభ్యంతరాలు లేవని అయన అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పేరును సైతం ప్రస్తావించారు.
వరుస వివాదాల సమయంలోనే…
ఇలా మంత్రి కొడాలి నాని పేరు విపక్షాలు విపులంగా ప్రచారంలో పెట్టిన సమయంలో తాజాగా ఆయన ఇలాకాలో జరుగుతున్న పరిణామాలపై మీడియాలో కొత్త వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మంత్రి ఇలాఖాలో..దసరా మామూళ్లు ఇవ్వాలంటూ డప్పు చాటింపు అంటూ కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో దసరా సందర్భంగా కార్డుదారులందరూ రేషన్ బియ్యానికి వచ్చేటప్పుడు రూ.20 చొప్పున దసరా మామూళ్లు ఇవ్వాలంటూ చాటింపు వేశారని ఆ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. కార్డుదారులందరూ రూ. 20 వంతున దసరా మామూళ్లు తెచ్చి ఇవ్వాలంటూ టముకు వేయాల్సిందిగా గ్రామంలోని కొందరు వ్యక్తులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై టాంటాం వేసే ప్రభాకరరావుతో చెప్పారని, దీంతో అతడు శనివారం ఉదయం గ్రామంలోని ప్రతి వీధిలో తిరిగి ఆ మేరకు చాటింపు వేశాడని ఆ మీడియా సంస్థలు పేర్కొన్నారు. అది విన్న గ్రామస్థులు, కార్డుదారులు విస్తుపోతున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగటంతో మరింత చర్చనీయాంశమైంది. ఈ ప్రచారంపై తహసీల్దార్ ఆంజనేయులు స్పందనను సదరు మీడియా సంస్థలు కోరగా చాటింపు వేయించినట్లు తమ పరిశీలనలో తేలిందని.. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారని ఆ కథనాల్లో ప్రస్తావించారు. మొత్తంగా ఈ కొత్త వివాదంతో కొడాలి నానిపై విపోఆలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సింది.