కర్నూలు, మార్చి 2: రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో శనివారం జరిగిన బహిరంగ సభలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి తన వర్గీయులతో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.
ఈ సందర్భంగా చంద్రబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సుధీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కోట్ల కుటుంబం టిడిపిలో చేరడం చాలా సంతోషదాయకమన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం కెఇ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాశరెడ్డిలు విబేధాలను విడనాడి కలిసి పని చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామమని చంద్రబాబు అన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధికి ఒకే రోజు 8100కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరిగిందని చంద్రబాబు తెలిపారు,
వేదవతి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం సశ్యశ్యామలం అవుతుందన్నారు.
ఏంతో కాలంగా ఈ ప్రాంత ప్రజల డిమాండ్ అయిన హైకోర్టు బెంచ్ కూడా తీసుకువస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు.
రాష్ట్రం ఇదే విధంగా అభివృద్ధిలో ముందుగు సాగాలంటే మరో సారి తెలుగుదేశం ప్రభుత్వానికి అందరూ ఆశీర్వదించాలని కోరారు.
సూర్యప్రకాశరెడ్డి తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా వేదవతి ఎత్తిపోతల పథకం శిలా ఫలకం, రాజోలిబండ కుడి కాల్వ పనులు శిలా ఫలకం, గండ్రేవుల జలాశయం పైలాన్లను చంద్రబాబు ఆవిష్కరించి ఎల్ఎల్సీ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో డిప్యూటి సిఎం కెఇ కృష్ణమూర్తి, పలువురు మంత్రులు పాల్లొన్నారు.